వేములవాడ ఆలయ ప్రాంగణంలో పార్కింగ్ అక్రమ వసూళ్లపై ఆలయ ఈఓ రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తురాలిలా ఓ ప్రైవేటు వాహనంలో వెళ్లి పార్కింగ్ టికెట్‌ కొనుగోలు చేసి జరుగుతున్న మోసాన్ని గ్రహించారు. ఆలయ టికెట్లకు బదులు అధిక ధరలతో సొంత టికెట్లు విక్రయిస్తున్న గుత్తేదారుని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పార్కింగ్ ఫీజు 50 రూపాయలకు బదులు 80 రూపాయలు, 30 రూపాయలకు బదులు 60 రూపాయలు, రూ.100 టికెట్లను రూ.150లకు అమ్ముతున్నట్లు బహిర్గతం అయింది.


అనంతరం పార్కింగ్‌ టెండర్‌ను రద్దు చేసి ఉచిత పార్కింగ్ కల్పిస్తున్నామని ఆలయ ఈఓ రమాదేవి వెల్లడించారు. అక్రమ సంపాదనకు ఆలయమే దొరికిందా అని అక్రమార్కులను ఈవో నిలదీశారు.


ఆలయంలో పార్కింగ్‌ టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌.. అధికారులు నిర్ణయించిన ధరలకంటే అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిపై ఆలయ అధికారులకు భక్తులు నుంచి ఫిర్యాదులు అందాయి. రెండు వారాల క్రితం ఆలయానికి రమాదేవి ఈవోగా వచ్చారు. రాగానే పార్కింగ్‌ అక్రమ వసూళ్ల సంగతేంటో తేల్చాలని డిసైడ్‌ అయ్యారు. అందుకో ఓ ప్లాన్‌ వేశారు. పార్కింగ్‌ కాంట్రాక్టర్‌ అక్రమాలను బయటపెట్టేందుకు ఆమె సాధారణ భక్తుల తరహాలో కారులో వెళ్లారు. టీటీడీ వసతి గదుల సముదాయంలోకి వెళ్లారు. కారు పార్కింగ్‌ ఎంతని అడగగా 80 రూపాయలంటూ అక్కడి సిబ్బంది తెలిపారు. దీంతో 80 రూపాయలు కారు పార్కింగ్‌ కోసం చెల్లించారు. అందుకు పార్కింగ్ సిబ్బంది రశీదు కూడా ఇచ్చారు.


80 రూపాయలు పార్కింగ్‌ ఫీజు చెల్లించినట్టు రశీదు ఇవ్వడంతో ఈవో రమాదేవి ఒక్కసారిగా శివంగిలా మారారు. పార్కింగ్‌ కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆలయ ఈవోనని.. చెప్పడంతో అక్కడి సిబ్బంది నీళ్లు నమిలారు. వాస్తవానికి ప్రతి కారుకు రూ.50 మాత్రమే వసూలు చేయాలి.. కానీ పార్కింగ్‌ కాంట్రాక్టర్‌ మాత్రం 80 రూపాయలు వసూలు చేస్తున్నారు. పార్కింగ్‌ రశీదుపై ఎలాంటి రుసుము లేకుండా ప్రింట్‌ చేయించారు. ఆలయ అధికారులు పార్కింగ్‌ ఫీజుతో ప్రింట్‌ చేసిన రశీదు పుస్తకాన్ని పక్కన పడేసి.. సొంతంగా ప్రింట్‌ చేయించుకుని ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారు.


ఇక భారీ వాహనాలకు రూ.100 వసూలు చేయాల్సి ఉండగా.. రూ.150 వసూలు చేస్తున్నారు. అధిక పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నట్టు తేలడంతో కాంట్రాక్టర్‌, సిబ్బంది వద్ద ఉన్న 20కి పైగా రశీదు బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. కాంట్రాక్టర్‌ లచ్చయ్యపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. సీఐకి ఫోన్‌ చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరారు.