Maoists Encounter | కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్, కాల్పులపై వెనక్కి తగ్గి మావోయిస్టులపై చర్చలు జరపాలని.. ఆపరేషన్ కగార్ (Operation Kagar) నిలిపివేయాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా పలు పార్టీలు ఎన్డీయే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు కొన్ని పార్టీల నేతలు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు లేఖలు సైతం రాశారు. ఆపరేషన్ కగార్ ఆపేదే లేదని, మావోయిస్టులతో మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అంటూ కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్ లోని కొత్తపల్లిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) ఆదివారం నాడు హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొత్తపల్లిలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టన పెట్టుకున్నోళ్లతో ఎలాంటి చర్చలు ఉండవు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో మందుపాతరలు పెట్టి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీసహా ఎంతో మంది నేతలను చంపినోళ్లు నక్సల్స్ కాదా.
ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ అమాయక గిరిజనులను ఇన్ ఫార్మర్ల నెపంతో అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చినోళ్లు మావోయిస్టులు. వాళ్లు తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదు. కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయం చారిత్రాత్మకం. ఇది కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ కులగణన సర్వేకు, మోదీ సర్కార్ చేపట్టనున్న కులగణను పొంతనే ఉండదు. కాంగ్రెస్ కులగణనతో తెలంగాణలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. బీసీల జనాభాను తగ్గించి చూపారు. కనుక కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదు.
కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ప్రజలు నమ్మడం లేదు
6 గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోంది. పాస్ పోర్టు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నాం. రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినా చర్యలెందుకు తీసుకోవడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే. ఆ రెండు పార్టీలు సిగ్గు లేకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలంటూ పోటీ పడుతున్నాయి. కానీ నక్సల్స్ తో మాటల్లేవు... మాట్లాడుకోవడాల్లేవ్’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అన్ని రంగాల్లో న్యాయం జరిగేలా చూసేందుకు కేంద్రం కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.