kalikota Suramma Project: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో కలికోట సూరమ్మ ప్రాజెక్టును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిశీలించారు. శ్రీపాద ఎల్లంపల్లి ఫేజ్ 2 స్టేజ్ 1ను 2005లో 1750 కోట్లతో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంజూరు చేశారని గుర్తు చేశారు. ఇంతమంచి ప్రాజెక్టును తీసుకొచ్చిన ఆది శ్రీనివాస్ ను ఆనాడు చెన్నమనేని రాజేశ్వర రావు అభినందించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 2018లో టీఆర్ఎస్ ఓడిపోతుందని మంత్రి హరీష్ రావు కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు శిలాఫలకం వేశారని ఆరోపించారు. కానీ ఈ నాలుగేళ్లలో ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. కాంగ్రెస్ నిరసనలు, పాదయాత్రలు, రాస్తారోకోలు చేసిందని... అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదన్నారు. 






ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం 
ముఖ్యమంత్రి కేసీఆర్ ను మారిస్తే తప్ప రైతుల జీవితాల్లో మార్పు రాదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కలికోట సూరమ్మ ప్రాజెక్టును 18 నెల్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆనాడు మేం మొదలు పెట్టిన ప్రాజెక్టును, రేపు మేమే పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ప్రాంత సమస్యలపై ఇక్కడి ఎమ్మెల్యేకు అవగాహన లేదని విమర్శలు చేశారు. విహార యాత్రకు వచ్చినట్లుగా ఎమ్మెల్యే జర్మనీ నుంచి వచ్చి పోతున్నారని తెలిపారు. కోర్టులను అడ్డుపెట్టుకొని సాంకేతికంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని వివరించారు. కానీ మానసకింగా ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా గుర్తించడం లేదన్న రేవంత్... వారసత్వం ముసుగులో రాజకీయాల్లో కొనసాగుతున్నారని వెల్లడించారు. 






అనంతరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామిని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. దక్షిణ కాశీ క్షేత్రంగా పేరుగొంచిన వేములవాడ రాజన్న సన్నిధిలో అడుగు పెట్టగానే అద్వితీయమైన అనుభూతి కల్గిందని పేర్కొన్నారు. ప్రజల కోసం వేసే ప్రతీ అడుగులో ఆ పరమశివుడే తోడుగా ఉండి నడిపిస్తున్నట్లుందని అన్నారు. తెలంగాణ సమాజాన్ని చల్లగా చూడాలని మొక్కుతూ.. హరహర మహాదేవ శంభోశంకరా అంటూ ట్వీట్ చేశారు. అలాగే భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.