Adluri Lakshman Car Accident | జగిత్యాల: తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది. ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు ఒక్కసారిగా ఊడిపోయింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కారు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు ఏం కాలేదు. ప్రమాదం నుంచి బయటపడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఏడాదిన్నర నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కాంగ్రెస్ నేతలకు ఇటీవల మంత్రివర్గ విస్తరణతో ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. వారిలో అడ్లూరి లక్ష్మణ్ ఒకరు. జూన్ 8న వివేక్ వెంకట్ స్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ లతో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయించారు. అడ్లూరి లక్ష్మణ్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనకు జూన్ 11న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖలను అధిష్టానం కేటాయించింది