హసన్‌పర్తి నుంచి హుజూరాబాద్ మీదుగా కరీంనగర్ రైల్వే లైన్ వెంటనే మంజూరు చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ బడ్జెట్‌లో తగిన నిధులు కూడా కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ నుంచి విద్యార్థులు, కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు నిత్యం హసన్‌పర్తి వెళ్తుంటారని తెలిపారు. హసన్ ఫర్తి- కరీంనగర్ రైల్వే లైన్ ఏర్పాటైతే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. రైల్వే శాఖకు ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. 


సర్వే ఎప్పుడో జరిగింది


హసన్‌పర్తి- కరీంనగర్ రైల్వేలైన్ అంశాన్ని చాలా సార్లు రైల్వేశాఖ దృష్టి తీసుకొచ్చామని.. రైల్వే బోర్డు ఛైర్మన్‌కు వినతి పత్రం అందజేసినట్టు బండి సంజయ్‌ వివరించారు. ఈ కొత్త రైల్వే లైన్ సాధ్యాసాధ్యాలపై గతంలోనే దక్షిణ మధ్య రైల్వే అధికారులు సర్వే చేసి 2013లోనే బోర్డుకు నివేదిక పంపారని తెలిపారు.







రూ. 464కోట్లు ఖర్చుతో అద్భుత లైన్ 


రైల్వే అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కోసం రూ.464 కోట్లు ఖర్చు అవుతాయని సంజయ్‌ మంత్రికి తెలిపారు. హసన్‌పర్తి- కరీంనగర్ రైల్వే లైన్ పూర్తైతే కరీంనగర్ తోపాటు పొరుగు ప్రాంతాలకు కూడా ఉపయోగకరమని పేర్కొన్నారు. వీటన్నింటిని బేరీజు వేసుకొని తక్షణమే కొత్త రైల్వే లైన్, నిధులు మంజూరు చేయాలని కోరారు. 


శ్రీ రాజరాజేశ్వర సూపర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చండి


కొత్త రైలు సర్వీసులు ప్రవేశపెట్టాలని మంత్రిని కోరారు బండి సంజయ్‌. కరోనా కారణంగా నిలిచిపోయిన రైళ్ల సర్వీసులను పునరుద్దరించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి –కరీంనగర్- తిరుపతి రైలును రోజూ నడిపేలా చర్యలు తీసుకోవాలని రిక్వస్ట్‌ చేశారు. ఈ ట్రైన్‌కు ‘శ్రీ రాజ రాజేశ్వర సూపర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్’గా పేరుపెట్టాలని సూచించారు. కరీంనగర్ నుంచి పెద్దపల్లి- జమ్మికుంట- కాజీపేట మీదుగా సికింద్రాబాద్‌కు కొత్త మెము ఎక్స్‌ ప్రెస్ రైలు ప్రవేశపెట్టాలని కోరారు. 


ఆ రైళ్లు పునరుద్ధరించండి


కరోనా కారణంగా నిలిపేసిన కరీంనగర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును వెంటనే పునరుద్ధరించాలని బండి సంజయ్‌ కోరారు. ఈ రైలులో ఎక్కువ మంది ప్రజలు ప్రయాణాలు చేస్తుంటారని 112.5% ఆక్యుపెన్సీతో నడిచేదని గుర్తు చేశారు. లోకమాన్య తిలక్ టెర్మినస్ రైలు సేవలను కూడా వెంటనే పునరుద్దరించాలని రిక్వస్ట్ చేశారు. 


సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ ప్రవేశ పెట్టండి


నిజామాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా సిర్పూర్ టౌన్ వరకు నడిచే ప్యాసింజర్‌ రైలును పునరుద్ధరించాలని బండి సంజయ్‌ కోరారు. దీనికి మోర్తాడ్ నుంచి నిజామాబాద్ వరకు విద్యుదీకరించి MEMUప్యాసింజర్‌గా మార్చాలని ప్రతిపాదించారు. కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో రెండో ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటుతోపాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని బండి సంజయ్ రైల్వే మంత్రిని కోరారు. సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్- కరీంనగర్ మీదుగా ఢిల్లీ, హరిద్వార్ వరకు తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రవేశపెట్టాలని కూడా అభ్యర్థించారు.