వస్త్రాల ఉత్పత్తికి నిలువెత్తు నిదర్శనంగా ప్రసిద్ధిగాంచిన సిరిసిల్లలో ప్రభుత్వం ఇక్కడి జేఎన్టీయూ కళాశాలలో పోయిన సంవత్సరం కొత్తగా టెక్స్‌టైల్ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ రంగంలో వస్తున్న మార్పులను విద్యార్థులు ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని వస్త్రాల తయారీతో పాటు, అందులో పరిశోధనలు చేయడమే లక్ష్యంగా దీన్ని ప్రవేశపెట్టింది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఈ కోర్సును ప్రారంభించారు. 2021-22 విద్యా సంవత్సరంలో సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ సివిల్, టెక్స్‌టైల్ విభాగాల్లో తొలి ఏడాది 170 మంది విద్యార్థులు చేరారు. వీటిలో టెక్స్‌టైల్ కోర్సులు 8 మంది విద్యార్థులు చేరారు. ఈసెట్ నుంచి వచ్చిన వారితో కలిపి ద్వితీయ సంవత్సరంలో 22 మంది ఉన్నారు. 
టెక్స్‌టైల్ లో సీట్లు మాత్రం భర్తీ కాలేదు..
2022-23 సంవత్సరానికి మొదటి విడత కౌన్సిలింగ్ లో టెక్స్‌టైల్ కోర్సులో నలుగురు చేరారు. రెండో విడత కౌన్సిలింగ్ లో వీరంతా మరో కోర్సులోకి వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఈ కోర్సులో ఎవరూ లేరు. ఎంసెట్ కౌన్సిలింగ్ పూర్తి అయిన టెక్స్‌టైల్ లో సీట్లు మాత్రం భర్తీ కాలేదు. ఇక మిగిలిన ఈసెట్ కౌన్సిలింగ్ లోనైనా ఎవరైనా చేరుతారేమోనని కళాశాల వర్గాలు భావిస్తున్నాయి. మహారాష్ట్రలోని ఇచ్చల్ కరంజ్ అనే ప్రాంతం సిరిసిల్లాల చేనేత మరమగ్గాలకు ప్రసిద్ధి చెందింది. 1982 వరకు అక్కడ చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడింది. నేతన్నలకు ఎలాంటి సాంకేతిక నైపుణ్యాలు లేకపోవడం సాంప్రదాయ మరమగ్గాలను నమ్ముకోవడం వల్ల నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకు పోయారు. ఫలితంగా ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతుండేవారు. దీనికి పరిష్కారంగా అక్కడి ప్రభుత్వం 1982లో అక్కడి పాలిటెక్నిక్ కాలేజ్ లో డిప్లమా కోర్సులో టెక్స్‌టైల్ ను చేర్చింది. వీటిని చదివిన విద్యార్థులు సాంకేతికతను అందుపుచ్చుకొని అక్కడి వస్త్ర పరిశ్రమలో మార్పు తేగలిగారు. ఫలితంగా దశాబ్దం తిరిగేసరికి సంక్షోభం నుంచి తీరుకొని లాభాల బాటలోకి వచ్చి దేశంలోని ఆదర్శంగా నిలిచింది. 
సెప్టెంబర్ లో జిల్లాకు చెందిన పలువురు వస్త్ర వ్యాపారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి అధ్యయనం చేసి అక్కడ నేతన్నల విజయగాథలను తెలుసుకొని వచ్చాను. ఇచ్చల్ కరంజి స్ఫూర్తితో సిరిసిల్లలోనూ టెక్స్‌టైల్ కోర్సులకు ఆదరణ లభించేలా చేసే వస్త్ర పరిశ్రమ మెరుగవడంతో పాటు కార్మికుల జీవితాల్లోనూ గణనీయ మార్పులు వస్తాయి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టి విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా చేయాల్సిన అవసరం ఎంతయిన ఉంది. విద్యార్థులు ఎవరూ టెక్స్‌టైల్ కోర్సు వైపు ఆసక్తి చూపకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులు ఎక్కువగా సీఎస్ఈ, ఐటీ వంటి కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లోని ఎక్కువగా చేరుతున్నారు. 
ఉద్యోగ అవకాశాలపై అవగాహన లేకపోవడం
ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, బ్లాక్ చైన్, వర్చువల్ టెక్నాలజీ వంటి కోర్సులు నేర్చుకుంటే తక్కువ సమయంలోనే అధిక జీతాలు పొంది స్థిరపడొచ్చనే అభిప్రాయంతో ఈ ఏడాది ఎక్కువ మంది విద్యార్థులు వీటిలో చేరారు. ఇందులో సీటు దక్కని వారు సివిల్, మెకానికల్ ఈసీఈ వంటి సాంప్రదాయ కోర్సుల్లో చేరారు. ఈ కోర్సులు చదివిన వారికి ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా ఉంటాయి. దీంతో వీటి ప్రభావం టెక్స్‌టైల్ పై ఎక్కువగా ఉంటుంది. ఈ కోర్సు అభ్యసించిన ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అనే అవగాహన లేకపోవడం, ప్రభుత్వం సైతం సరిగా ప్రచారం చేయకపోవడంతో ప్రత్యేక శ్రద్ధతో ప్రవేశపెట్టిన ఈ ఏడాది నిరాశ ఎదురయిందని పలువురు విద్యా నిపుణులు భావిస్తున్నారు. 
అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలోని టెక్స్‌టైల్ డిప్లొమా కోర్సుది ఇదే పరిస్థితి. కౌన్సిలింగ్ పూర్తయిన నాటికి 8 మంది మాత్రమే చేరడం గమనార్హం. సిరిసిల్ల జేఎన్టీయూలో ఈ ఏడాది కోర్సుల్లో ప్రవేశాల వివరాలు ఇలా ఉన్నాయి. సీఎస్ఈ 66 మంది విద్యార్థులు, ఈసీఈ 66 మంది విద్యార్థులు, ఈఈఈ 32 మంది విద్యార్థులు, సివిల్ 20 మంది విద్యార్థులు, మెకానికల్ 2 విద్యార్థులు చేరగా టెక్స్‌టైల్ కోర్సులో మాత్రం ఒక్కరు కూడా ఇప్పటివరకు చేరలేదు.