Sircilla News: సంప్రదాయ వంటకాలపై వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో పెట్టే ఓ వ్యక్తి ఇప్పుడు జైలు పాలయ్యాడు. జాతీయ పక్షి నెమలి కూర పేరుతో వంటకాన్ని వండి యూట్యూబ్‌లో పెట్టడంతో సమస్యల్లో చిక్కుకున్నాడు. దాన్ని చూసిన పలువురు నెటిజన్లు పోలీసులకు, యూట్యూబ్‌కు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు. ఆయన్ని పోలీసులు అరెస్టు చేస్తే, ఆ వీడియోను యూట్యూబ్‌ వాళ్లు డిలీట్ చేశారు. 


సిరిసిల్లకు చెందిన ప్రణయ్‌కుమార్‌ అనే వ్యక్తి తన ఇంటి వద్దే సంప్రదాయపద్దతిలో వంటలు చేస్తూ యూట్యూబ్‌లో పెడుతుంటారు. ఆయనకు 277K సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ఆయన చేసిన వీడియోలు బాగానే వైరల్ అవుతుంటాయి. కొత్త కొత్త వంటకాలు ట్రై చేయలన్న ఆలోచన ఇప్పుడు ఆయన్ని జైలు పాలు చేసింది. 


జాతీయ పక్షి నెమలి వంటకం పేరుతో ప్రణయ్‌ పెట్టిన వీడియో సమస్యలు తెచ్చి పెట్టింది. సంప్రదాయపద్దతిలో నెమలి కూర ఎలా వండాలో చూడండి ఫ్రెండ్స్ అంటూ శనివారం ఓ వీడియోను ఆయన యూట్యూబ్‌లో పెట్టారు. ట్రెడిషనల్ పీకాక్‌ కర్రీ రెసిపీ అన్న పేరుతో వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు ప్రణయ్‌. 
దీన్ని గమనించిన జంతు ప్రేమికులు భగ్గుమన్నారు. ప్రణయ్‌ ఇలా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారం ఇది సరికాదని మరికొందరు యూట్యూబ్‌కు రిపోర్ట్ చేశారు. స్పందించిన యూట్యూబ్ ఆ వీడియోను తొలగించింది. 


నెమలి కూర పేరుతో వీడియో చేయక ముందే ప్రణయ్‌ చాలా నిషేధిత జంతువుల కూరలను కూడా వండి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ నెమలి ఇష్యూ వచ్చిన తర్వాత చూస్తే అలాంటివి చాలా గుర్తించారు నెటిజన్లు. అంతే వాటిని వెంటనే తొలిగించాలని యూట్యూబ్‌కు ఫిర్యాదు చేయడంతో వాటన్నింటినీ యూట్యూబ్ తొలగించింది. అలాంటి వాటిలో అడవి పంది మాంసం వంటకం కూడా ఉంది. 


వన్యప్రాణులను, జాతీయ పక్షులు, జంతువులను చంపడం నేరం. ప్రణయ్‌ మాత్రం వాటిని చంపడమే కాదు.. వాటి మాంసాన్ని ఎలా వండాలో చూపించే వీడియోలను కూడా అప్‌లోడ్‌ చేయడం ఇప్పుడు వివాదం మరింత ముదురుోతంది. జంతు ప్రేమికులు ఫిర్యాదు మేరకు ప్రణయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నెమలి కూర పేరు వండిన వంటకాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని ల్యాబ్‌కు పంపించారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయనపై చర్యలు తీసుకోనున్నారు.