సిరులగని సింగరేణి! 134 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థ. కడుపులో నల్లబంగారాన్ని దాచుకున్న నేల. భూమిలో దాగిన అపార బొగ్గురాశి నిల్వలు దేశానికి వెలుగు దారులను పంచుతుంటాయి! అలాంటి సింగరేణిలో కోల్  ఎలా వెలికితీస్తారు? బావుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆక్సిజన్ ఎంత వరకు అందుతుంది? భూగర్భంలో ఎంత వేడి విడుదలవుతుంది. తేడావస్తే ఏం జరుగుతుంది? కార్మికులు ఏ కండిషన్లో పని చేస్తారు? ఎంత లోతుకు వెళతారు? ఎలా లోపలికి పోతారు? ఎలా బయటకి వస్తారు? బొగ్గును ఎలా తరలిస్తారు? సొరంగాల్లో యంత్రాలు ఎలా పనిచేస్తాయి. అక్కడ తవ్విన బొగ్గును పైకి ఎలా తరలిస్తారు? ఇవన్నీ ఆసక్తిరేపే ప్రశ్నలు. తట్ట, చెమ్మ, వ్యవహారం చాలామందికి తెలియదు. అలాంటి ఇంట్రస్ట్ విషయాలను తెలుసుకునేందుకు పెట్టిందే కోల్ టూరిజం!


నిత్యం మృత్యువుని వీపున మోసుకుంటూ నడిచేదే సింగరేణి కార్మికుడి జీవితం! కష్టాన్ని ఒక భుజంపై, మృత్యువును మరో భుజం ఎత్తుకుని వెళుతుంటాడు. అలాంటి పనిని కళ్లారా చూస్తే.. ఎవరైనా సలాం కొట్టాల్సిందే! లోపలికి వెళ్లడం మాత్రమే వారి చేతుల్లో ఉంటుంది. బయటకి రావడం తలరాత మీద ఆధారపడి ఉంటుంది! అంటే, సింగరేణి కార్మికుడి బతుకు దినదినగడం నూరేళ్ల ఆయుష్షు! అలాంటి రాకాసి బావులను ఒక కామన్ మ్యాన్‌గా ఎవరూ ప్రత్యక్షంగా చూడలేరు! పర్మిషన్ ఇవ్వరు! అలాంటి వారికోసం తెలంగాణ ఆర్టీసీ, సింగరేణి సంయుక్తంగా కోల్ టూరిజం-సింగరేణి దర్శన్ పేరుతో టూరిజం ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది!  


సింగరేణి - టీఎస్ఆర్టీసీ ప్రారంభించిన కోల్‌టూరిజం-సింగరేణి దర్శన్‌ ప్యాకేజీకి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి శనివారం హైదరాబాద్‌ JBS  నుంచి సింగరేణి దర్శన్‌ పేరుతో ప్రత్యేక బస్సు బయలుదేరుతుంది. ఒక్కరికి రూ. 1,600 టికెట్. జేబీస్ నుంచి స్టార్టయి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని GDK 7 LEP కోల్‌మైన్‌ దగ్గరకు బస్సు చేరుకుంటుంది. అక్కడ పర్యాటకులకు మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. హార్ట్ బీట్, బీపీ, పల్స్ రేట్, బ్రీథింగ్ టెస్ట్ వగైరా చెక్ చేస్తారు! ఎందకంటే, వాళ్లు వెళ్లేది భూగర్భంలోకి కాబట్టి! ముందుజాగ్రత్త! ఆ తర్వాత టూరిస్టులను మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ద్వారా బొగ్గుబావిలోకి తీసుకెళతారు. సింగరేణి అధికారే గైడ్‌గా వ్యవహరిస్తాడు. కోల్‌ మైన్ విశేషాలను ఆయన వివరిస్తుంటాడు.


ప్రస్తుతం సింగరేణి బొగ్గు బావుల్లో అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. గతంలో భూగర్భంలో బొగ్గును బ్లాస్టింగ్ చేసి టబ్బుల్లో నింపేవారు. బొగ్గు టబ్బులను రోప్‌ ద్వారా పైకి పంపేవారు. ప్రస్తుతం కంటిన్యూ మైనర్, ఎస్‌డీఎల్‌ వంటి మెషినరీని వాడుతున్నారు. ఈ పద్ధతిలో బొగ్గును కట్‌ చేసి, షటిల్ కార్‌ మెషీన్‌లో పోస్తారు. అక్కడ నుంచి కన్వేయర్ బెల్ట్ ద్వారా కోల్ పైకి చేరుతుంది. ఇదంతా మనం ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.


భూగర్భంలో బొగ్గు బ్లాకులు ఎలా ఉంటాయి? బొగ్గు తవ్విన తర్వాత వాటిని ఎలా భర్తీ చేస్తారు? అనే విషయాలను కూడా యాత్రికులకు ప్రత్యక్షంగా చూపిస్తారు. ఇక భూగర్భంలోకి గాలి ఎలా వస్తుంది? ఒకవేళ గ్యాస్‌ లీక్ అయితే చేపట్టే చర్యలను కూడా వివరిస్తారు. బొగ్గుబావుల సందర్శన తర్వాత లంచ్‌ ఉంటుంది. టూరిస్టుల కోసం సింగరేణి గెస్ట్ హౌజ్‌లో ఉచితంగా భోజన సదుపాయం కల్పించారు. ఆ తర్వాత ఓపెన్ కాస్ట్ మైన్‌ టూర్ ఉంటుంది. టూరిస్టులను RG-2 OPC3 ఉపరితల బొగ్గు గని దగ్గరకు తీసుకెళతారు. అక్కడ బ్లాస్టింగ్ జరిగే విధానం, పేలుళ్ల తర్వాత బొగ్గు పైకి తీసుకొచ్చే యంత్రాల పనితీరును లైవులో చూపిస్తారు. తర్వాత మంచిర్యాల జిల్లాలోని జైపూర్ పవర్‌ ప్లాంట్‌ చూపిస్తారు. దాంతో కోల్ టూరిజం ప్యాకేజీ ముగుస్తుంది.


కేవలం రూ.1600 రూపాయలకే ఒక్క రోజులో ఇవన్నీ సందర్శించే అవకాశం కల్పించింది సింగరేణి సంస్థ. అందుకే కోల్ టూరిజం ప్యాకేజీకి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సింగరేణి సందర్శన కోసం పెద్ద ఎత్తున టూరిస్టులు తరలివస్తున్నారు. సింగరేణి-ఆర్టీసీ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. బొగ్గుబావులు, ఓపెన్ కాస్ట్ మైనింగ్‌, థర్మల్ పవర్ ప్రాజెక్టు చూసి పబ్లిక్ థ్రిల్ అవుతున్నారు.