Siddipet Murder Case: సిద్దిపేట సీసీఎస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న గౌటి ప్రవీణ్‌ కుమార్, గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. 2007లో విధుల్లో చేరిన ఇతను, సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉండి కూడా ఆన్‌లైన్ బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయాడు. 

Continues below advertisement

ప్రవీణ్ కుమార తన భార్య రజితతో కలిసి గత రెండేళ్లుగా విపరీతంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఆడుతూ సుమారు 60 లక్షల వరకు నష్టపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో రూ. 30 లక్షల వరకు అప్పుల పాలై, వాటిని తీర్చే మార్గం లేక నేరాల బాట పట్టారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో తమకు తెలిసిన వారినే లక్ష్యంగా చేసుకొని కుట్రలు చేశారు. 

రియల్టర్ విశ్వనాథం హత్య

ఈ కేసులో ప్రధాన  బాధితుడు సిద్ధిపేటకు చెందిన రియల్టర్‌ బెల్దె విశ్వనాథం. ప్రవీణ్‌ కుమారు తన తమ్ముడికి చెందిన ఒక స్థలాన్ని విశ్వనాథం బంధువు వద్ద తాకట్టు పెట్టించి 12 లక్షల అప్పు ఇప్పించాడు. అయితే ఆ ప్లాటును విక్రయించాలని విశ్వనాథం చెప్పగా, ప్రవీణ్ అందుకు నిరాకరించి, మోర మంచి ప్లాటు చూపిస్తానని నమ్మించాడు. 

Continues below advertisement

గత శనివారం పథకం ప్రకారం, ప్రవీణ్ రజిత ఇద్దరూ విశ్వనాథాన్ని తమ కారులో ఎక్కించుకొని మెట్టుబండల శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కారులోనే ఉన్న సమయంలో విశ్వనాథం కాళ్లూచేతులు కట్టేసి మెడ చుట్టూ వైరు బిగించి అత్యంత దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం అతని ఒంటిపై ఉన్న సుమారు పది తులాల బంగారు నగలను దొంగిలించారు. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని ఇమాంబాద్‌ సమీంపలోని ఒక కాలువలో పడేశారు. ఆ తర్వాత దంపతులిద్దరూ కారులో నేరుగా హైదరాబాద్‌ వెళ్లి, అక్కడ ఒక బంగారు దుకాణంలో నగలను విక్రయించారు. 

కానిస్టేబుల్ దంపతులు ఎలా దొరికారంటే?

విశ్వనాథం కనిపించకపోవడంతో అతని భార్య వనిత చిన్నకోడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం రాత్రి మృతదేహాన్ని గుర్తించారు.ఏసీపీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో సీసీఎస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు లోతైన దర్యాప్తు చేశారు. 

పోలీసులు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు విశ్లేషించారు. టెక్నికల్ అనాలసిస్ ఆధారంగా విచారణ జరపగా, ప్రవీణ్ కుమార్ కారు కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. గట్టిగా విచారించడంతో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. మంగళవారం వీరిని అరెస్టు చేసి, బుధవారం రిమాండ్‌కు తరలించారు. 

వృద్ధురాలి నగలు చోరీ 

విశ్వనాథం హత్య కేసు దర్యాప్తులో ప్రవీణ్ కుమార్ చేసిన మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. గత నెల 25న తన ఇంటికి సమీపంలో ఉండే నర్సవ్వ అనే వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకెళ్తానని కారులో ఎక్కించుకున్నారు. దారి మధ్యలో ఆమెను ఏమార్చి, మెడలోని బంగారు పుస్తెల తాడు చోరీ చేశారు. బంగారం పోయిందని ఏడుస్తున్న వృద్ధురాలిని స్వయంగా ప్రవీణ్ కుమార్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించాడు. ఎవరికీ తెలియకుండా డ్రామా ఆడాడు. దొంగిలించిన నగలను కూడా హైదరాబాద్‌లో విక్రయించాడు.