Mancherial News: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ నేతలు మళ్లీ కొట్టుకున్నారు. హస్తం పార్టీ నేతలకు గ్రూప్ తగాదాలు కామన్. అప్పుడప్పుడు వాళ్లలో వాళ్లే కొట్టుకోవడం కూడా తరచుగా జరుగుతుంటుంది. అయితే హత్ సే హత్ జోడో అభియాన్ పేరుతో పార్టీని బలోపేతం చేయాలని, ప్రజల్లోకి వెళ్లాలని అధిష్టానం భావిస్తే కిందిస్థాయి నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుండడంతో కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అసలేం జరిగిందంటే..?


మంచిర్యాల జిల్లాలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో రసాభసా చోటు చేసుకుంది. టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గోమాస శ్రీనివాస్ వర్గంపై మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావ్ వర్గం దాడి చేయడంతో కె.వి ప్రతాప్ అనే కాంగ్రెస్ సీనియర్ నాయకునికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లిలో బుధవారం టిపిసిసి జనరల్ సెక్రటరీ, పెద్దపల్లి పార్లమెంట్ ఇన్చార్జి గోమాస శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. బైరి శ్రీనివాస్, గెల్లి జయరాం యాదవ్ కొద్ది రోజుల కిందట పార్టీకి రాజీనామా చేశారు. దీంతో వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. తాజాగా ఈరోజు వారిని పార్టీలోకి గోమాసా శ్రీనివాస్ ఆహ్వానించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు, మాజీ ఎమ్మెల్యే అమ్మ రాజుల శ్రీదేవి, నాయకులు కారుకూరి రామచందర్, కె.వి ప్రతాప్ తదితరులతో కలిసి అనంతరం ఆయన భారీ కాన్వాయ్ తో ఆ కార్యక్రమానికి బయలు దేరారు. 


బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ గడ్డ వద్ద ప్రేంసాగర్ రావ్ వర్గం అడ్డుకుంది. కొద్ది రోజులుగా తాము ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తుంటే గుమాస శ్రీనివాస్ పెత్తనం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, జి.ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావ్ కు తెలియకుండా ఇక్కడికి రావడం ఏమిటని ప్రశ్నించారు. ప్రత్యర్థి వర్గంపై దాడి సైతం చేశారు. ఇందులో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.