MLA Durgam Chinnaiah: మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్ గేట్ సిబ్బందిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేయి చేసుకున్నారు. నిన్న అర్ధరాత్రి హైదరాబాదు నుంచి బెల్లంపల్లికి వస్తున్న క్రమంలో టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఆపడంతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య టోల్గేట్ సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా టోల్ గేట్ ప్రారంభించినప్పటి నుంచి స్థానిక వాహన దారులపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా టోల్ గేట్ రుసుము కట్టినప్పటికీ రసీదులు ఇవ్వకపోవడం జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై గత నాలుగు రోజుల క్రితం స్థానిక వాహనదారులు సైతం టోల్ గేట్ వద్ద ఆందోళన చేశారు. 






 


ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. దళిత యువకుడిపై వైసీపీ ఎంపీటీసీ దాడి చేశారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మండలం ఉలవపాళ్ళ పెట్రోల్ బంక్ లో ఇది జరిగింది. సర్వర్ పనిచేయని కారణంగా పెట్రోల్ పోయలేమన్నాడా యువకుడు. దీంతో పొడిగుడిపాడు వైసీపీ ఎంపీటీసీ మహేష్ దాడి చేశారు. అత్యంత దారుణంగా అనుచరులతో కలిసి దాడి చేశాడు. ఇది కూడా సీసీటీవీల్లో రికార్డు అయింది. ఇప్పుడు ఈ రెండు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. 






 


ఇటీవలే టోల్ సిబ్బందిపై న్యాయ విద్యార్థుల దాడి


తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్.వి.పురం టోల్ ప్లాజా వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. తమిళనాడుకు చెందిన లా స్టూడెంట్స్ టోల్ గేట్ సిబ్బందిపై దాడికి దిగ్గారు. పుత్తూరు ప్రైవేట్ కళాశాలలో లా చదువుతున్న తమిళనాడు విద్యార్థులు తిరుపతిలో కొద్ది రోజులుగా పరీక్షల రాస్తున్నారు. ఈ క్రమంలో‌ శనివారం పరీక్షలు చివరి రోజు కావడంతో తిరుపతి నుంచి తిరుగు ప్రయాణంలో వడమాలపేట ఎస్.వి.పురం టోల్ ప్లాజా వద్ద లా విద్యార్థి కారు టోల్ రుసుము చెల్లింపులో టోల్ యాజమాన్యం సిబ్బందితో గొడవ దిగారు. రుసుము చెల్లించడానికి ఆ వాహనానికి ఉన్న ఫాస్ట్ ట్యాగ్ లో డబ్బులు లేనందున టోల్ సిబ్బంది వాహనాన్ని వెనక్కి తీసి మిగిలిన వారికి దారి వదలమని చెప్పడంతో మాట మాట పెరిగి తమిళనాడు విద్యార్థులు మొదటగా సిబ్బందిపై హెల్మెట్ తో దాడి చేశారు. 


స్థానికులపై దాడి 


రుసుము చెల్లింపు జరగకపోవడం గొడవకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.  విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. వడమాల పేట ఎస్ఐ రామాంజనేయులు లా విద్యార్థులతో  జరిగిన సంఘటనపై కంప్లైంట్ ఇవ్వమని పబ్లిక్  వాహనాలకు ఇబ్బంది కలగకుండా పక్కకు రమ్మని చెప్పినప్పటికీ విద్యార్థులు మొండిగా వ్యవహరించడమే కాకుండా టోల్ ప్లాజా సిబ్బంది క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాహనాలకు దారి ఇవ్వకపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లా విద్యార్థులు మరింతగా రెచ్చిపోయి పోలీసులతో గొడవకు దిగారు. అంతే కాకుండా టోల్ ప్లాజా ప్రదేశానికి చేరుకున్న స్థానికులపై లా కళాశాల విద్యార్థులు దాడికి దిగారు. దీంతో స్థానికులు లా కళాశాల విద్యార్ధులపై తిరగబడడంతో పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు. లా విద్యార్థులు ప్రాంతీయ భావాన్ని పదే పదే వ్యక్త పరుస్తూ టోల్ గేట్ లైన్లో తమిళనాడు వాహనాలకు దారి వదులుతూ ఏపీకి సంబంధించిన వాహనాలను నిర్బంధిస్తూ ధర్నాకు దిగారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని వనమాలపేట ఎస్సై రామాంజనేయులు తెలిపారు.