గతంలో కేవలం ఉత్తరాలు, మనీ ఆర్డర్ సేవలకు మాత్రమే పరిమితమైన ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు పలు రకాల సేవలను అందిస్తోంది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రైల్వే లాంటి వివిధ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సర్వీసులతో జనాధరణ పొందుతోంది. క్రియేటివ్ గా ఆలోచిస్తే రెవిన్యూ పెంచడం పెద్ద కష్టం కాదని నిరూపిస్తోంది పోస్టల్ శాఖ. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆధార్ కార్డు నమోదు తో పాటు ఏమైనా తప్పులుంటే మార్చుకోవడానికి ఏర్పాటు చేసిన సర్వీస్ కి ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. 


ఈనెల తొమ్మిది నుండి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వారోత్సవాలను నిర్వహిస్తున్న పోస్టల్ డిపార్ట్మెంట్ సేవలు కి సంబంధించి ఉమ్మడి జిల్లాలోని వివరాలు ఇవీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి పోస్టల్ డివిజన్ పరిధిలో పెద్దపల్లి గోదావరిఖని, జమ్మికుంట, హుజురాబాద్, మంథని, సబ్ డివిజన్లో సుమారు 50 సబ్ పోస్ట్ ఆఫీస్ లు 300 బ్రాంచి పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారు.


తక్కువ అమౌంట్ కి ప్రత్యేక ఇన్సూరెన్స్ పథకాలు
ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వైకల్యం కలిగినా లేదా మృత్యువాత పడినా.. ఆ కుటుంబం పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇలాంటి వారి కోసం అతి తక్కువ సొమ్ముతో వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తెచ్చింది. కేవలం 399 రూపాయల ప్రమాద బీమా పాలసీ తీసుకుంటే యాక్సిడెంట్ లో మృతి చెందినా లేదా అంగవైకల్యం ఏర్పడినా, పక్షవాతం లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో వైకల్యం ఏర్పడినా పది లక్షల వరకు నగదు చెల్లిస్తారు. 
ఆస్పత్రికి ఖర్చుల కొరకు 60 వేల వరకు అవుట్ పేషెంట్ గా ట్రీట్మెంట్ కై 30,000 హాస్పిటల్ కి వెళ్లడానికి అంబులెన్స్ ఇతర రవాణా ఖర్చులకై 25000, ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే అతని పిల్లల చదువుల కోసం ప్రత్యేకంగా లక్ష రూపాయలు చెల్లిస్తారు. ఇక 299 రూపాయలకి ఆసుపత్రి రవాణా ఖర్చులు, పిల్లల చదువులు ఖర్చు మినహా మిగతా ప్రయోజనాలు అన్ని వర్తించే విధంగా స్కీంని అమలు చేస్తున్నారు. ప్రధాన మంత్రి సురక్ష యోజన లో ఏడాదికి కేవలం 20 రూపాయలు చెల్లిస్తే చాలు పాలసీదారుడు మృతి చెందితే రెండు లక్షలు అంగవైకల్యం ఏర్పడితే లక్ష రూపాయలు చెల్లిస్తారు.


ఆధార్ కోసం ప్రత్యేక సర్వీసులు 
ఈరోజుల్లో ఆధార్ తప్పనిసరిగా మారింది ఒకవేళ ఆధార్ లో ఏమైనా తప్పులు ఏర్పడితే వాటిని త్వరగా మార్చుకోవడానికి సైతం పోస్టల్ డిపార్ట్మెంట్ సేవలను అందిస్తోంది.మరోవైపు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను సైతం పింఛన్దారులకు అత్యవసరంగా అందించే ఏర్పాటు చేసింది. వీటితోపాటు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ను సైతం అందుబాటులో ఉంచి ప్రయాణికులు రైల్వే టికెట్ల బుకింగ్ ని త్వరితగతిన చేసుకునేలా సేవలందిస్తోంది. ఇక అతి తక్కువ ధరలకే దేశ విదేశాలకు కొరియర్ సర్వీసులను సైతం అందిస్తోంది మరోవైపు "సుకన్య సమృద్ధి యోజన" పేరుతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక స్కీము ద్వారా కేవలం 250 రూపాయల నుండి లక్షన్నర వరకు పొదుపు చేసుకునేలా ప్రజల్ని ప్రోత్సహిస్తోంది. పరిస్థితులకు తగ్గట్టుగా మారితే ప్రజల ఆదరణ తప్పకుండా ఉంటుందని పోస్టల్ డిపార్ట్మెంట్ నిరూపిస్తోంది.