Karimnagar News: కరీంనగర్ వాసులకు అన్ని సౌకర్యాలతో కొత్త మార్కెట్లు నిర్మించేందుకు కార్పొరేషన్ సంస్థ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న ప్రధాన కూరగాయల మార్కెట్ సరిపోవడం లేదు. లోపలి భాగంలో స్థలం లేకపోవడంతో రోడ్లమీద టవర్ సర్కిల్ ప్రాంతంలో దుమ్ము, ధూళిలో అమ్ముతున్నారు. వీడిని అరికట్టేందుకు నగర వాసుల మేలు కోరి వెజ్, నాన్ వెజ్ లభించేలా సమీకృత మార్కెట్లు కట్టేందుకు పట్టణ ప్రగతి స్మార్ట్ సిటీ కింద ప్రతిపాదనలు చేసింది. సర్కారు కూడా పనులను ప్రారంభించింది. కొన్ని పనులు ఆలస్యంగా ప్రారంభం అయినా ఆ తర్వాత లైన్లో పడ్డాయి. ఇటీవల జిల్లా ఆదనపు పాలనాధికారి గరిమ అగర్వాల్ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. 


వచ్చే ఏడాది మార్చి 31లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం


సమీకృత మార్కెట్లు నగరవాసులకు అందుబాటులోకి వస్తే అన్ని వస్తువులు ఒకే దగ్గర దొరికేలా నిర్మాణ పనులకు ప్రతిపాదనలు చేశారు. కూరగాయలు, మాంసం, చేపల దుకాణాలు వేరువేరుగా ఉండనున్నాయి. పూలు, పండ్ల దుకాణాలు ఏర్పాటు చేస్తారు. లోడింగ్ అన్ లోడింగ్ ప్లాట్ ఫామ్ లో సులభ్ కాంప్లెక్స్, ప్రహరీ పచ్చదనం, కార్యాలయ గదులు ఇందులో ఉంటాయి. కాశ్మీర్ గడ్డలో ఇంకా ప్రారంభించకపోగా, కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదురుగా భవనాన్ని కూల్చేందుకు ఆలస్యమైంది. ఈ రెండు చోట్ల మినహాయిస్తే మిగతా కిసాన్ నగర్, పద్మ నగర్ లో నిర్ణీత గడువులోగా పూర్తి కావాలి. అయితే ఇచ్చిన సమయం దాటిపోగా వచ్చే సంవత్సరం మార్చి 31లోగా పనులు పూర్తి కావాలని ఇప్పటికే రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ వై. సునీల్ రావు అధికారులను ఆదేశించారు. 


డిజైన్లు ఇవ్వడంలో ఆలస్యంగా చేయగా.. ప్రారంభమైన పనులు


నగరంలో ప్రారంభించిన సమీకృత మార్కెట్లో పనులు చేస్తుండగా కేటాయించిన నిధులు సరిపోవని ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. డిజైన్లు ఇవ్వడంలో ఆలస్యం చేయగా, ఇప్పటికే పనులు ప్రారంభించారు. అయితే వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు అందుబాటులోకి తీసుకొచ్చేలా భవన నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. మూడు చోట్ల కలిపి రూ.6 కోట్లు అదనంగా అవసరమని అధికారులు చెబుతున్నారు. ఒకసారి డిజైన్లు ఇచ్చిన తర్వాత మార్చకుండా పనులు జరిపించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. నిధులు మంజూరు కాకపోతే మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నగరంలో నాలుగు చోట్ల సమీకృత మార్కెట్లు నిర్మించేందుకు 39.90 కోట్లు కేటాయించారు. కిసాన్ నగర్ లోని వ్యవసాయ మార్కెట్లో 1.88 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు. మొత్తం 146 దుకాణాలు లిఫ్ట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ప్రస్తుతం జీ+1 స్లాబు వేయగా, రెండో వైపు స్లాబ్ చేసేందుకు పనులు సాగుతున్నాయి. దుకాణాల వారీగా అరలు నిర్మించారు. 


పాత షెడ్డులు కూల్చి వేసి నిర్మాణం..


కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదురుగా రూ.2.31 ఎకరాల స్థలం ఉండగా ఇందులో మొత్తం 347 దుకాణాలు అందుబాటులో ఉండనున్నాయి. ప్లిన్త్ లెవెల్ కాలమ్స్ వెయ్యగా స్లాబ్ కోసం చర్యలు చేపట్టారు. పద్మా నగర్ లో 2.08 ఎకరాల స్థలంలో మార్కెట్ నిర్మించేందుకు పనులు చేస్తుండగా మొత్తం 239 దుకాణాలు నిర్మిస్తారు. కాశ్మీర్ గడ్డలో ప్రస్తుతం రైతు బజారు స్థలంలోనే నిర్మించనున్నారు. వ్యాపారుల కోసం పక్కనే తాత్కాలిక షెడ్లు వేయించగా.. వీరికి అక్కడికి తరలించి పాత షెడ్డు పూర్తిగా కూల్చివేయనున్నారు. దీని కోసం స్మార్ట్ సిటీలో రూ.10 కోట్లు కేటాయించారు. డిజైన్ ప్రకారం పార్కింగ్, కూరగాయల వ్యాపారులు కూర్చోవడానికి అనువైన స్థలం కేటాయిస్తారు.