కొన్ని పార్టీలు తనపై వచ్చిన ఆరోపణలలో స్వార్థపూరితంగా వాడుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటితో తనకు ఎటువంటి సంబంధం లేదని సస్పెన్షన్ గురైన జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ కుమార్ తేల్చి చెప్పారు. ఒక పార్టీ తలపెట్టిన పట్టణ బంద్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో పని చేస్తున్నానని, ఎటువంటి కల్మషాలు లేకుండా శాంతి భద్రత పరిరక్షణకు నిబద్ధతతో వ్యవహరించానని తెలిపారు. 


ఇటీవల తనపై వచ్చిన ఆరోపణల రీత్యా క్రమశిక్షణ చర్యల మీద పోలీసు నియమ నిబంధల ప్రకారం చట్టపరంగా పరిష్కరించుకుంటానని అన్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు, ఒక వర్గానికి చెందిన ప్రజలు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారంతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసమే అలా చేస్తున్నారని స్పష్టం చేశారు. తన పేరిట శనివారం రోజున బంద్‌కు పిలుపునిచ్చినట్లు తనకు తెలిసిందని, ఆ బంద్ కు తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. 


బంద్ పాటించి ప్రజలకు ఎలాంటి విఘాతం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. తనకు చట్టంపై, పై అధికారులపై విశ్వాసం ఉందని, తాను ఎటువంటి తప్పు చేయలేదని కాబట్టి అధికారులు విచారణ జరిపించి తగిన న్యాయం చేస్తారని భావిస్తున్నానని చెప్పారు.


నా భర్త ఏ తప్పు చేయలేదు మాకు న్యాయం చేయండి - ఎస్సై భార్య ఆవేదన


కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్తున్న బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవ వివాదానికి దారి తీసింది. ఈ వివాదంలో చివరకు ఓ ఎస్సై సస్పెండ్ అవ్వడం, ఆయన భార్యపై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. తన భార్యతో గొడవ పడిన మైనార్టీ యువతిపై ఎస్సై దాడికి పాల్పడ్డాడని, ఆమెను జుట్టు పట్టుకుని బస్సు నుంచి కిందకు లాక్కొచ్చినట్లు వార్తలొచ్చాయి. బూటు కాళ్లతో తన్నుతూ అసభ్యకర పదజాలంతో ఎస్సై దూషించినట్లు మైనార్టీ యువతి ఆరోపిస్తుంది. అయితే సస్పెండ్‌కు గురైన ఎస్సై అనిల్ భార్య సంధ్య వాదన మాత్రం మరోలా ఉంది. మైనార్టీ యువతినే తనను నోటికొచ్చినట్లు తిట్టడంతో పాటు కొట్టారని, తన భర్త ఆమెను కొట్టలేదని చెబుతోంది.


'నా బిడ్డకు పాలిచ్చే పరిస్థితి లేకపోవడంతో సీటు ఇవ్వాలని నేను యువతిని కోరాను. కండక్టర్ కూడా సీటు ఇవ్వాలని చెప్పారు. కానీ యువతి ఆగ్రహంతో ఊగిపోయింది. నీ అంతు చూస్తానని, మా వాళ్లకు ఫోన్ చేశానంటూ బెదిరించింది. బస్టాండ్‌లో మా వాళ్లు వెయిట్ చేస్తున్నారని, నీ పని, నీ కొడుకు సంగతి చూస్తారంటూ హెచ్చరించింది. వర్గ విబేధాలు రెచ్చగొట్టే విధంగా నేను అసలు మాట్లాడలేదు. కండక్టర్ మరో బస్సు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదనడం వల్ల నేను ఆ బస్సులో ప్రయాణించాను. మరో బస్సులో వచ్చి ఉంటే ఈ గొడవ కూడా జరిగేది కాదు. మార్గం మధ్యలో జగిత్యాల బస్ స్టేషన్‌కు రావాలని ఆమె ఫోన్లు చేయడంతో నాకు భయం వేసింది. దీంతో నా భర్త అనిల్‌కు ఈ విషయం చెప్పాను' అని సంధ్య మీడియా ముందు తన గొడు వెల్లబోసుకుంది.


'యువతి దూషణలు తట్టుకోలేక ఏడుస్తూ నా భర్తకు ఫోన్ చేశా. బస్‌స్టేషన్ వరకు నేను రానని, బస్ డిపో వద్ద దిగుతానని చెప్పాను. దీంతో నన్ను రిసీవ్ చేసుకునేందుకు నా భర్త వచ్చారు. వివరాలు అడిగి తెలుసుకుంటున్న క్రమంలో యువతి వీడియో తీస్తుంటే నా భర్త అడ్డుకుని ఫోన్ లాక్కొవడంతో సెల్ కిందపడిపోయింది. ఫోన్ లాక్కుంటున్న క్రమంలో ఆమెకు, నాకు మధ్య జరిగిన పెనుగులాటలో నా చేతి గాజులు పగిలిపోయాయి. ఈ ఘటనలో నా చేతికి గాయం కూడా అయింది. నా భర్త యువతిని బూట్లతో కొట్టలేదు. మఫ్టీలో ఉన్న వ్యక్తి స్లిప్పర్లు వేసుకుని వస్తే బూట్లతో తన్నాడని యువతి చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదు' అని సంధ్య వివరించారు.