Satavahana University gets 12 B status from UGC: కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న శాతవాహన యూనివర్సిటీలో కొందరు సిబ్బంది చేసిన నిర్వాకం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. యూనివర్సిటీకి చెందిన ఐదుగురు ఒప్పంద అధ్యాపకులు జాతీయ స్థాయిలో ముఖ్యమైన 12 బీ హోదా రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో గుర్తుతెలియని వ్యక్తుల మాదిరిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (University Gransts Commission) కు కొన్ని సమస్యలు ప్రస్తావిస్తూ మెయిల్స్ పంపారు. యూనివర్సిటీలో సరైన సౌకర్యాలు లేవంటూ ముఖ్యంగా మ్యాథ్స్, ఇంగ్లిష్, బాటనీ, ఇలాంటి విభాగాల్లో అనేక లోటుపాట్లు ఉన్నాయని దానికి తగ్గట్టుగా విచారణ జరగకముందే 12బీ హోదాను యూనివర్సిటీకి కట్టబెట్టారని యూజీసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో  యూనివర్సిటీ గ్రాంట్స్ సిబ్బంది విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు ఉన్నత అధికారులకు ఈ సమాచారాన్ని అందించారు.


జాతీయ స్థాయిలో ఉండే బృందం ఇక్కడి స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు విద్యార్థులతో, యూనివర్సిటీ అధికారులతో, అధ్యాపకులతో చర్చించి పరిశీలించిన తరువాతే 12బీ హోదాను ఇచ్చింది. అయితే పరిశోధనలకు అవసరమైన నిధులు రావడానికి ఈ హోదా చాలా కీలకం. కానీ అంత కీలకమైన హోదాను క్యాన్సల్ చేసే విధంగా యూనివర్సిటీకి చెందిన ఐదుగురు కాంట్రాక్టు అధ్యాపకులు వ్యవహరించడం పట్ల విద్యార్థులు, వారి పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు చేయడానికి ఇలాంటి విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకోవడం సరైంది కాదంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. 


గుర్తుతెలియని వ్యక్తుల పేరుతో రాసిన లేఖలు బయట యూనివర్సిటీ పేరుని తగ్గించేలా హోదా వచ్చిన 16 రోజుల తర్వాత వరుసగా ఆరు లేఖల్ని యూజీసీ (UGC)కి రాయడంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు దీనికి సంబంధించి ప్రాథమిక విచారణ చేపట్టడానికి యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌ ముందుగా సమాచారం అందించారు. దీంతో నలుగురు అధ్యాపకులతో కూడిన విచారణ కమిటీ గ్రౌండ్ లెవెల్ లో ఏం జరిగిందో పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలుసుకోడానికి ప్రయత్నించగా ఒక కాంట్రాక్టు అధ్యాపకుడి మెయిల్ ద్వారా తన డెస్క్ పై ఉన్న కంప్యూటర్ నుంచి వెళ్లినట్లు తేలింది. 


మొదట ఈ హోదా అడ్డుకోవడానికి ప్లాన్ చేసిన వ్యక్తితో సహా మిగతా వారికి 15వ తారీఖున షోకాజ్ నోటీసులు అందించి మరీ ఉద్యోగం నుండి తొలగించి నట్లు వైస్ ఛాన్స్‌లర్ ఎస్. మల్లేశం అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును అడ్డుకునేలా రాజకీయాలు చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు. సదరు అధ్యాపకులు గతంలోనూ యూనివర్సిటీ చెడ్డపేరు తెచ్చేలా వివిధ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ  విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అని ఉన్న సామెతను నిజం చేసేవిధంగా ఇన్ని రోజుల పాటు తమకు ఉపాధిప్ అందించిన స్థలం పేరు ప్రఖ్యాతులు ఓర్వలేని సిబ్బంది వ్యవహార శైలి పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అంతర్గత విచారణ సైతం జరుగుతోంది.