Corporator Abusive Words: వినాయక మండపాలకు విద్యుత్ సరఫరా చేసే విషయంపై అధికార పార్టీకి చెందిన ఓ కార్పోరేటర్ మున్సిపల్ విద్యుత్ శాఖ ఉద్యోగిపై ఫైర్ అయ్యారు. ఉద్యోగితో పాటు అతని పై అధికారిని కలిపి బూతులు తిడుతూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆడియో నెట్టింట వైరల్ గా మారింది. తమ డివిజన్ లోని అన్ని వినాయక మండపాల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, తాను మొత్తం వినాయకుల వద్ద తిరుగుతానని ఆ కార్పొరేటుర్ అన్నారు. అలాగే నువ్వు ‘ఆ కథలు ....కు" అంటూ దర్భాషలాడిన తీరు స్థానికులను విస్మయానికి గురి చేస్తోంది. మున్సిపల్ అధికార వర్గాలకు వాట్సాప్ ద్వారా షేర్ అయిన ఈ ఆడియోపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ కావడంతో అతనిపై ఫిర్యాదు చేసేందుకు ఉద్యోగులు వెనకాడుతున్నట్లు సమాచారం. 


అధికారంలో ఉన్నాడు కాబట్టే ఏం చేయలేకపోతున్నారా.. 
అందులోనూ ఆ కార్పొరేటర్ మంత్రి గంగుల కమలాకర్ కి అత్యంత సన్నిహితుడు అన్న ప్రచారం కూడా ఉండటంతో.. బూతులు తిట్టినా ఏం అనలేకపోయారని అర్థం అవుతోంది. విద్యుత్ దీపాల విషయంపై ఇంత ఘోరంగా తిట్టడం అవసరమా అని చాలా మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా విద్యుత్ శాఖ అధికారులను.. కార్పొరేటర్ ఇలా తిట్టి ఉండకూడదని అంటున్నారు. మామూలుగా చెప్తే అయిపోయేదానికి ఇంత రాద్దాంతం అవసరమా అంటున్నారు. ఉద్యోగులను తిట్టడమే తప్పంటే.. వారి ఇంట్లో వాళ్ల గురించి కూడా ఇలా బూతులు మాట్లాడడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారం ఉందనే అహంతోనే అతడు ఇలా మాట్లాడాడంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై అధికారులే చర్యలు తీస్కోవాలని అంటున్నారు. ఇలాంటి వారిపై ఎలాంటి ఫిర్యాదు చేయకుండా వదిలేస్తే... భవిష్యత్తులో అందరితోనూ ఇలాగే ప్రవర్తిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


ఏపీలోనూ అధికారం ఉందనే అహంతో పోలీసు అరాచకం..! 
నెల రోజుల క్రితం.. రక్షకుడిగా ఉండాల్సిన పోలీస్ భక్షకుడిగా మారాడు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కలిగిన ఏఎస్ఐ కంట్రోల్ తప్పాడు. మద్యం మత్తులో అర్దరాత్రి వీరంగం చేశాడు. తనకు బిర్యానీ ఇవ్వలేదన్న కోపంతో హోటల్ సిబ్బందిపై బూతుల పర్వానికి దిగాడు. అంతటితో ఆగకుండా వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సత్యసాయి జిల్లాలో బుధవారం అర్ధరాత్రి జరిగింది.


అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించిన ఏఎస్ఐ ఉజైతుల్లా అర్ధరాత్రి సమయంలో మూసి ఉన్న ఎస్వీ దాబాకు వెళ్లాడు. నిద్రపోతున్న సురేంద్ర నాయుడును నిద్రలేపి లేపి 10 బిర్యానీలు పార్సల్ కావాలని అడిగాడు. అర్ధరాత్రి అయిందని, దాబా కూడా మూసేశామని.. బిర్యానీ లేదని సర్వర్ సురేంద్ర బదులిచ్చాడు. దాబా సిబ్బంది ఎంత నచ్చజెప్పినా వినిపించుకోని ఏఎస్ఐ.. నేను ఎవరనుకుంటున్నావు , నాకు భోజనం లేదని చెబుతావా నీకెంత ధైర్యం అంటూ మద్యం మత్తులో గొడవకు దిగి, ఆపై సురేంద్ర నాయుడపై దాడికి పాల్పడ్డాడు. 


పోలీసులను ఆశ్రయించిన దాబా సిబ్బంది.. 
తనకు న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆశ్రయించారు దాబా సిబ్బంది. ఏఎస్ఐ తనపై దూర్భాషలాడుతూ, దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్సైని వివరణ కోరగా దాబా హోటల్ లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో అక్కడికి విచారించడానికి వెళ్లగా దాబా సిబ్బంది, పోలీసులకు వాగ్వివాదం జరిగిందని, ఈ క్రమంలో ఏఎస్ఐ సర్వర్ పై చేయి చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.