Jagtial Contaminated Food | ఓవైపు రాష్ట్రంలో ఆహార భద్రత అధికారులు ప్రముఖ హోటళ్లతో పాటు చిన్న చిన్న హోటల్స్ లో కూడా నాణ్యత పరిణామాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని హోటల్లో తనిఖీలు చేపట్టి నాణ్యత పరిణామాలు పాటించని హోటళ్లపై చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆహార నాణ్యతపై అధికారులు ఎన్ని తనిఖీలు నిర్వహించినప్పటికీ కొంతమంది హోటల్ నిర్వాహకులు నాణ్యత పరిణామాలు పాటించడం లేదు. అందుకు జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన నిదర్శనం. 


జగిత్యాలలో ఉడిపి హాటల్‌లో నాణ్యత లేదు


జగిత్యాల జిల్లా కేంద్రంలోని గణేష్ భవన్ ఉడిపి హోటల్లో ఇడ్లీలో జెర్రీ పురుగు వచ్చింది. జిల్లా కేంద్రానికి చెందిన ఒక కుటుంబం ఉదయం టిఫిన్ చేయడానికి హోటల్ కి వెళ్ళారు. ఇడ్లీ ఆర్డర్ చేసి వారు చిన్న బాబుకు తినిపిస్తుండగా ఇడ్లీలో జెర్రీ పురుగు వచ్చింది.హోటల్ యజమానిని ఆ వినియోగదారులు అడుగగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. తన దురుసు ప్రవర్తనతో  మహిళపై దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారని వినియోదారులు తెలిపారు.


ఇడ్లీలో జెర్రీ పురుగు వచ్చిందని ఆందోళన చేయడంతో ఇడ్లిలను మున్సిపల్ చెత్త బండిలో పడేయడానికి హోటల్ సిబ్బంది ప్రయత్నించారు. ఆ వినియోగదారులు అడ్డుకోవడంతో సిబ్బంది హోటల్ యజమాని వారితో దురుసుగా ప్రవర్తించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయంపై జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఆ హోటల్లో ఇడ్లీ తినడానికి వచ్చిన వినియోగదారులు తెలిపారు.


ఇక ఈ ఘటన పై సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది, పోలీసులు హోటల్ వద్దకు చేరుకొని హోటల్ లో ఉన్న మిగతా కస్టమర్లను బయటికి పంపించేసి, హోటల్ ని మూసివేసి ఫైన్ విధించారు. ఇలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్న ఈ హోటల్ పై కస్టమర్లపై దురుసుగా ప్రవర్తించిన యజమాని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధిత కస్టమర్ అధికారులను కోరినట్లు తెలిపారు.


ఎక్కడ మార్పు...?


ఏది ఏమైనాప్పటికీ రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీలు విఫలం అవుతున్నాయా...? లేక నాణ్యత పరిణామాలు పాటించకపోతే ఏమవుతుందిలే ఎవరేం చేస్తారులే అనే ధైర్యంతో హోటల్ నిర్వాహకులు ప్రవర్తిస్తున్నారా అని స్థానికులు భావిస్తున్నారు. మొత్తంగా హోటల్ నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలు పాటించలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 


అధికారుల నిర్లక్ష్యమా...? లేక ప్రజల నిర్లక్ష్యమా...?


పెద్ద పెద్ద హోటళ్ల సంగతి పక్కన పెడితే రోడ్లపై ఉండే స్ట్రీట్ ఫుడ్స్ నిర్వాహకులు ఎలాంటి నాణ్యత పరిణామాలు చేపట్టడం లేదు. నాలుగు గోడల మధ్య నాణ్యతతో వండాల్సిన వంటకాలు రోడ్డుపై ఎలాంటి భద్రత పాటించకుండా హోటల్ వివాహకులు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు దండుకుంటున్నారు. కానీ ప్రజల ఆరోగ్యంపై బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా కరీంనగర్ కేంద్రంలోని కొన్ని  ప్రముఖ హోటల్లో కూడా ఎలాంటి నాణ్యత పరిణామాలు పాటించని హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ హోటల్ నిర్వాహకుల ప్రవర్తనలో మాత్రం మార్పు రావడంలేదని తెలుస్తుంది.


Also Read: Telangana Crop Loan Waiver: రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్, రుణమాఫీపై డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం