కరీంనగర్ మాజీ మేయర్ టీఆర్ఎస్ సీనియర్ నేత సర్దార్ రవీందర్ సింగ్ రాజకీయ ప్రస్థానం అనూహ్య మలుపులు తిరగబోతోందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తుంది ఒక సమయంలో పార్టీ నుండి బలవంతంగా బయటకు వెళ్లే పరిస్థితిని సృష్టించిన సొంత పార్టీ నేతలే ఇప్పుడు సర్దార్ జి కి సరైన సమయం వచ్చిందంటూ చర్చించుకుంటున్నారు. అసలేం జరుగుతోందంటే


సర్దార్ రవీందర్ సింగ్... కరీంనగర్లో సీనియర్ రాజకీయ నేతగా పేరున్న నాయకుడు. పట్టణంలోని సిక్కువాడకు చెందిన రవీందర్ సింగ్ మొదట విద్యార్థి స్థాయిలోనే స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. తరువాత రవీందర్ సింగ్ మొదట 1995 లో స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్ గా ఎంపికై తర్వాత బీజేపీలో కొనసాగారు. ఆ పార్టీ పట్టణ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఒకవైపు న్యాయవాదిగా పనిచేస్తూనే స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సైతం ఎన్నికయ్యారు. నిత్యం ప్రజల్లో ఉండడంతో అప్పుడు మంచి దూకుడు మీదున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం దృష్టిలో పడ్డారు. 


కేసీఆర్ పట్టణంలో పట్టు కోసం బలమైన నేత కోసం ఎదురు చూస్తుండగా ఇటు మైనార్టీ నేతగా న్యాయవాదిగా పేరున్న రవీందర్ సింగ్ ని ఎంపిక చేసుకున్నారు. ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన రవీందర్ సింగ్ కి రాష్ట్ర ఏర్పాటు తర్వాత సరైన పదవి దక్కింది. కరీంనగర్ లాంటి కీలక పట్టణ కార్పొరేషన్ కి మేయర్ గా ఎంపిక చేశారు. కేసీఆర్ హాయాంలో 2014 నుండి 2019 వరకు మేయర్ గా పని చేసిన రవీందర్ సింగ్ ప్రాధాన్యత స్థానిక మంత్రితో విభేదాల వల్ల నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది.


 పలుమార్లు పార్టీ కి వ్యతిరేకంగా మాట్లాడడంతో అధిష్టానం సైతం తీవ్ర చర్యలు తీసుకుంటుందేమో అనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఇక ఏకంగా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీకి రాజీనామా చేసిన రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. దీంతో పాటు మంత్రి గంగుల కమలాకర్.. అతని అనుచరుల కార్పొరేటర్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకానొక సమయంలో తిరిగి భారతీయ జనతా పార్టీలకు వెళ్లిపోతారంటూ ప్రచారం సైతం జరిగింది.


కానీ ఏ రోజు కూడా ఈ విషయంపై పెదవి విప్పని రవీందర్ సింగ్ సొంతంగానే పోటీకి సై అన్నారు. పట్టణంలో పార్టీని చీల్చబోతున్నారా? అని అనుమానాలు సైతం వ్యక్తం అయ్యాయి. దీంతో కొంత కాలం పాటు స్థానిక నాయకులు కార్యకర్తలలో గందరగోళం నెలకొంది. చివరకు ఎన్నికల వరకు సైలెంట్ గా ఉన్న రవీందర్ సింగ్ కి ఆకస్మికంగా కేసీఆర్ నుండి పిలుపు రావడంతో ప్రగతి భవన్ వెళ్లి కలిశారు. మళ్లీ అప్పటినుండి సీఎం కేసీఆర్ రవీందర్ సింగ్ కి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. ముఖ్యంగా జాతీయస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ అందుకు అనుగుణంగా సిక్కు సామాజిక వర్గానికి చెందిన రవీందర్ సింగ్ కి మళ్లీ చోటు ఇవ్వడంతో పాటు ఉత్తర భారత దేశ పర్యటనలో తన వెంట తీసుకు వెళ్ళడం మొదలుపెట్టారు. ఏకంగా పార్టీ అధినేత నుండి ప్రాధాన్యత రావడంతో సర్దార్జీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.