BJP MLA Etela Rajender Road Accident: 


కరీంనగర్ జిల్లా :- బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మెన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు తృటిలో ప్రమాదం తప్పిపోయింది. వీణవంక పర్యటనకు వెళ్ళి వస్తుండగా మానకొండుర్ మండలం లలితపూర్ లో ఈటెల కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. గొర్రెలు అడ్డురావడంతో ముందు వెళ్తున్న కాన్వాయ్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఈటెల ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టింది.  ఈటల క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు కాలేదని తెలియగానే ఆయన అభిమానులు, బీజేపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.


రోడ్డు ప్రమాదంపై స్పందించిన ఈటల రాజేందర్.. 
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం, లలితాపూర్ గ్రామం వద్ద తాను ప్రయాణిస్తున్న వాహనానికి, తన సిబ్బంది ఉన్న వాహనానికి ప్రమాదం జరిగిందని ఎమ్మెల్యే ఈటల తెలిపారు. చీకటి పడడంతో ఎదురుగా వస్తున్న గొర్రెల మందను చివరి నిమిషంలో చూసి డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దాంతో వెనక వస్తున్న ఎస్కార్ట్ వాహనం తాను ఉన్న వాహనానికి ఢీ కొట్టడంతో వాహనం స్వల్పంగా దెబ్బతిందని చెప్పారు. భగవంతుని దయవల్ల, ప్రజల ఆశీస్సులతో తనతో పాటు అందరూ క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ట్విట్టర్ (X)లో వెల్లడించారు.