Karimnagar News: పెట్రోల్, డీజిల్ ధరలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఇంధన ధరలు తగ్గించిందని అన్నారు. కాబట్టి, తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రం ప్రభుత్వం వేసే సుంకాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ ఆదివారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘లీటరు పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వరకు పన్ను వేస్తోంది. ఆ వ్యాట్ కనుక తగ్గిస్తే తెలంగాణలో పెట్రోల్ ధర కేవలం రూ.80 కే ఇవ్వవచ్చు.’’ అని బండి సంజయ్ అన్నారు. మరోవైపు, కేసీఆర్ ఢిల్లీ పర్యటన, కేటీఆర్ విదేశీ పర్యటనపై కూడా బండి సంజయ్ విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ ఇక్కడ ఉద్ధరించింది ఏమీ లేదని దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. కొండగట్టులో ప్రజలు చనిపోతే, ఆర్టీసీ సమ్మెలో చనిపోతే పరామర్శించలేదు కానీ, రైతు కుటుంబాలను ఆదుకొనేందుకు వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. మంత్రి కేటీఆర్ కూడా తాను దోచుకున్న సొమ్ము దాచుకునేందుకు విదేశీ పర్యటనకు వెళ్లారని అన్నారు.


పెట్రోల్‌ బాదుడుపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. చమురుపై పన్ను తగ్గించడంతో జనాలకు కొద్దిలో కొద్ది ఊరట కలిగింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తగ్గింపు సాహసోపేత నిర్ణయమని అన్నారు. ఈ నిర్ణయంతో దేశంలోని కోట్లాది మందికి ఎంతో ఉపశమనం కలుగుతుందని చెప్పుకొచ్చారు.


అంతేకాక, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ప్రతి గ్యాస్ సిలిండర్‌ పై రూ.200 తగ్గించడం కూడా హర్షణీయమని బండి సంజయ్ అన్నారు. దీని వల్ల కేంద్రంపై రూ.6,100 కోట్ల భారం పడుతున్నా, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. ఎరువుల సబ్సిడీ కోసం అదనంగా రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తామనడం చారిత్రాత్మకమని అన్నారు. బహిరంగ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరుగుతున్నా, ఆ భారాన్ని సబ్సిడీ రూపంలో మోదీ సర్కార్ భరిస్తోందని అన్నారు. రైతులపై భారం పడకుండా పాత ధరలకే ఎరువులు అందించాలని అన్నారు. స్టీల్, సిమెంట్ ధరల నియంత్రణ చర్యలు తీసుకోవడం విప్లవాత్మక నిర్ణయమని అభిప్రాయపడ్డారు. స్టీల్ ఎగుమతులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించడం ద్వారా ధరలను కేంద్రం నియంత్రిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం తక్షణమే పెట్రోల్, డీజిల్‌ ధరలపై వ్యాట్ తగ్గించాలని.. దీనిపై ప్రజా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.