Karimnagar: ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతూ ఉన్న వంతెన వర్షాకాలం మొదలవగానే వరదలకు గురై  రాకపోకలకు అంతరాయం కలగడం సర్వసాధారణంగా మారింది. ఇక కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతూ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన.. గోదావరి నదిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఈమధ్య టెండర్ పూర్తయింది. మొదట రూ.100 కోట్లతో పైవంతెన నిర్వహిస్తామని ప్రకటించిన అధికారులు.. తరువాత 2022-23 అదనపు బడ్జెట్ లో రూ.164 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఇందుకోసం పరిపాలన అనుమతి ఉత్తర్వులు ఈ సంవత్సరం మే 30న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. నిధుల మంజూరు టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో ఉమ్మడి జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నుంచి మంచిర్యాల పట్టణం మీదుగా జగదల్పూర్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారికి ఈ వంతెన మార్గాన్ని అనుసంధానం  చేయనున్నారు. 


బ్రిడ్జి నిర్మాణంతో తగ్గనున్న 25 నుంచి 30 కి.మీల దూరం..


పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ రాజీవ్ రహదారి నుంచి అంతర్గామ్ మీదుగా గోదావరి నది పైవంతెన మార్గం  ఏర్పడనుంది. రాజీవ్ రహదారిపై వెహికిల్స్ రద్దీ పెరగడంతో పాటు ముఖ్యంగా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలు, ఉమ్మడి జిల్లాల ప్రజల రాకపోకలకు 25 నుంచి 30 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది. ఎగువ, దిగువ దారులతో కిలోమీటర్ నర పొడవున నిర్మించే ఈ వంతెన గోదావరి నది వరదకు తట్టుకునేలా ఉండాలి. ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన దగ్గరగా ఈ వంతెన నిర్మింస్తుండటంతో గేట్లు  ఎత్తినప్పుడు వరద కిందికి వస్తోంది. ప్రతిపాదిత ప్రదేశాల్లో నేల పరీక్షలు జరపాలి. భూగర్భ సర్వే విభాగం, భారీ నీటిపారుదల పర్యావరణ అనుమతులను పొందాలి. అంతర్గాo వద్ద రైల్వే పైవంతెన నిర్మించి వందేళ్ళు దాటింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చెక్కుచెదరకుండా నిలబడింది. ఇక్కడే రైల్వే వారు మూడో మార్గం కోసం రెండవ వంతెన నిర్మించారు. 


వంతెన నిర్మాణానికి భూసేకరణ అవసరం లేదు...


ఈ ప్రదేశంలోని అంతర్గాం మంచిర్యాల పట్టణం మీదుగా కాకుండా బైపాస్ దారి మీదుగా పైవంతెన నిర్మిస్తే అన్ని విధాలుగా బాగుంటుందని భావిస్తున్నారు. బసంత్ నగర్ రాజీవ్ రహదారి నుంచి వంతెన రోడ్డు అనుసంధానంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. వంతెన నిర్మాణానికి భూసేకరణ అవసరం లేదు. మంచిర్యాల పట్టణం మీదుగా కాకుండా బైపాస్ దారి మీదుగా అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. అందుకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంపై రహదారులు, భవన శాఖ అధికారులు నాలుగేళ్లుగా సర్వేలు చేస్తున్నా పరిష్కారం దొరకడం లేదు. నిర్మాణానికి సంబంధించిన టెండరు ప్రక్రియ పూర్తి కావడంతో రహదారులు, భవన శాఖ చీఫ్ ఇంజినీర్ సమక్షంలో ఈ నెల 7న హైదరాబాద్ లో సమావేశం కానుంది. 


త్వరగా పూర్తి చేయాలంటున్న ప్రజలు..


ఈసారి జరగనున్న సమావేశంలో పూర్తి స్థాయిలో ప్లానింగ్ తో అధికారులు నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలు పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు అన్ని అనుమతులు పూర్తయ్యాయి కాబట్టి వెనువెంటనే వంతెన నిర్మాణం ప్రారంభం అవుతుందని అధికారులు హామీ ఇస్తున్నారు. ఏదేమైనా దశాబ్దాల కల నెరవేరడంతో అనుమతులు ఇచ్చినంత వేగంతో పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.