Minister Gangula Kamalakar : ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే ఎనలేని ప్రేమ అని, ఈ జిల్లాను బలోపేతం చేసేందుకే భానుప్రసాదరావుకు చీఫ్ విప్, కౌశిక్ రెడ్డి కి విప్  పదవులు ఇచ్చారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శాసన మండలి చీఫ్ విప్ గా ఎన్నికైన తానిపర్తి భానుప్రసాద్ రావు మొదటి సారి పెద్దపల్లి జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కొరుకంటి చందర్, జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...2009లో తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు నీళ్ల కోసం ఎండిన వరి పంటతో అసెంబ్లీలో ఆందోళన చేపట్టామన్నారు. 


అదే జరిగితే యాభై ఏళ్లు వెనక్కి 


ఈ రోజు స్వయంపాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో 24 గంటల కరెంటుతో  భూమికి బరువయ్యే పంట పండుతోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆనాడు ఆంధ్ర పాలకులు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని..నీళ్లు ఉంటే కరెంట్ ఉండదు..పండిన పంట కొనే పరిస్థితి లేదనీ అన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా..ఆంధ్రోళ్ల కళ్లు మళ్లీ తెలంగాణపై పడిందని అన్నారు. మళ్లీ తెలంగాణను దోచుకునేందుకు పాదయాత్రల పేరిట మాయమాటలు చెప్పుకుంటూ ఊర్లల్లోకి వస్తున్నారని విమర్శించారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మాయమాటలు నమ్మి మోసపోతే తమ పిల్లల భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని..ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగలకు అవకాశం ఇవ్వకూడదన్నారు. రాష్ట్ర భవిష్యత్ రానున్న ఎన్నికలతో ముడిపడి ఉందని, మోసపోతే గొసపడతామని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనీ 13 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచి సత్తా చాటుతామని అన్నారు. నిరంతరం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పరితపించే కేసీఆర్ కు అండగా ఉండాలని, పొరపాటు జరిగితే తెలంగాణ యాభై ఏళ్లు వెనక్కి వెళ్తామని అన్నారు.