Etela Rajender : రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ లను ప్రజలు నమ్మడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.  కరీంనగర్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి  హాజరైన ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అధికార పార్టీ అరాచకాన్ని అడ్డుకునే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందన్నారు.  అందుకు ఉదాహరణ దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఎన్నికలన్నారు. కేవలం కొట్లాడితేనే ప్రజల్లో ఉండలేమని, వారి సమస్యలు కూడా పరిష్కరించే ప్రయత్నం చెయ్యాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు. గవర్నర్ ఫోన్ కూడా టాప్ అవుతుంది అనే చెప్పుకొనే పరిస్థితి ఉందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను కూడా కేసీఆర్ పనిచేయనివ్వడంలేదన్నారు. నా రాజ్యంలో నేను చెప్పిందే వేదం అన్నట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. 


బియ్యం కొనం అని కేంద్రం చెప్పలేదు


కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కాలేదని ఈటల రాజేందర్ విమర్శించారు. దళిత సీఎం చేయకపోగా దళిత ఉప ముఖ్యమంత్రిని అవమానకరంగా తీసేశారన్నారు. మూడు ఎకరాల భూమి ఇస్తా అని దళితులను మోసం చేశారని ఆరోపించారు. అంతేకాదు ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా లాక్కుని రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళిత బంధు రాష్ట్రం అంతా ఇస్తా అని హుజూరాబాద్ కి ఇచ్చి మిగతా వారికి ఇవ్వడంలేదన్నారు. గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా వారికి సంకెళ్లు వేసి జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్రంలో దుర్మార్గ పాలన చేస్తున్నారు. లాభదాయంగా లేవని కేసీఆరే  సింగరేణి గనులు తీసుకోకుండా.. ఇప్పుడు కేంద్రాన్ని విమర్శిస్తున్నారన్నారు. బియ్యం కొనుగోలు చేయమని కేంద్రం ఏనాడూ చెప్పలేదని, ఉప్పుడు బియ్యం మాత్రమే వద్దు అని చెప్పారన్నారు. దాన్ని ఒప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు ధాన్యం కొనలేక ఆ నెపాన్ని కేంద్రం మీద నెడుతున్నారన్నారు. అబద్ధాన్ని కూడా నమ్మించగల మోసకారి కేసీఆర్ అన్నారు. కనీస మద్దతు ధర అమలు చేయకుండా రైతుల ఉసురు తీస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఒక్క రైతు బంధు ఇచ్చి మిగతా సబ్సిడీలు అన్నీ ఎత్తివేశారన్నారు. గుట్టలకు, పుట్టలకు మన చెమట పైసలు పంచిపెడుతూ రాచరికపు ఆలోచనలు చేస్తున్నారన్నారు. 


ప్రజల్లో ఉన్న వారికే టికెట్లు 


"కరీంనగర్ జిల్లా దేన్నైనా భరిస్తుంది కానీ రాచరికాన్ని సహించదు. తిరుగుబాటు బావుటా ఎగురవేసే సత్తా ఉన్న జిల్లా. తెలంగాణ ఉద్యమ బావుటా ఇక్కడ నుంచి ఎగిరింది. మళ్లీ ఆ పార్టీ పతనం ఇక్కడించే మొదలైంది. కేసీఆర్ వైఫల్యాలపై ప్రజా ఉద్యమం చేద్దాం. ఇతర పార్టీ నాయకులను బీజేపీలోకి ఆహ్వానించండి. బీజేపీకి అధికారం వచ్చే అవకాశం ఉంది కాబట్టే నాయకులు మన పార్టీకి వస్తున్నారు. ఎవరు వచ్చినా ప్రజల్లో ఉన్న వారికే ఎమ్మెల్యే టిక్కెట్లు. సర్వేల ఆధారంగానే టిక్కెట్లు ఇస్తారు. కరీంనగర్ జిల్లాలో ఇంకా మనం గేట్లు ఓపెన్ చెయ్యలేదు. ప్రజలు బీజేపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ బీజేపీ ఏకు మేకు అయ్యిందని భావిస్తున్నారు. బీజేపీ నాయకుల మీద దాడులు చేయండని కేసీఆర్ చెప్తున్నారు. ఏ నిమిషం ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండండి. మనలో మనం కొట్లడుకోడం మంచిది కాదు. మనది ప్రజల పార్టీ. గ్రామపంచాయతీలకు కేంద్రం ఇచ్చే డబ్బులు తప్ప దిక్కులేదు. స్థానిక సంస్థలను కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారు." - ఈటల రాజేందర్