Bandi Sanjay Phone : తన మొబైల్ పోయిందని కరీంనగర్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. ఈనెల 4వ తారీఖున అర్ధరాత్రి తనను అరెస్టు చేసిన సమయంలో తాను వాడుతున్న మొబైల్ పోయిందంటూ బండి సంజయ్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటివరకు ఆయన మొబైల్ పై జరుగుతున్న ప్రచారం మరో మలుపు తిరిగినట్టు అయింది. ఆ ఫోన్ నిజానికి తన సోదరి డాక్టర్ సౌమ్య పేరుపై ఉందని... భద్రత కారణాల వల్ల తాను ఇతరుల పేరుపై నెంబర్లు వాడాల్సి వస్తుందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.  తన కాంటాక్ట్స్ పోయాయని... ఇప్పటికే ఫోన్ కి సంబంధించి పోలీసులు వెతుకుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని కాబట్టి స్పందించి వెంటనే తన ఫోన్ తనకు వచ్చేలా చేయాలని పోలీసులను కోరారు. 


ఫోన్ చుట్టూ వివాదం 


తన ఫోన్‌ పోయిందని బండి సంజయ్‌ ఆదివారం కరీంనగర్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటకు వచ్చిన వ్యవహారంలో ఈనెల 5న బండి సంజయ్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో తన ఫోన్‌ ఎక్కడో పడిపోయినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మెయిల్‌ ద్వారా కరీంనగర్‌ రెండో పట్టణ పోలీసులకు బండి సంజయ్‌ ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫోన్ చుట్టూ ఇప్పుడు రాజకీయం నడుస్తోంది. పదో తరగతి హిందీ పేపర్ లీకేజీకి సంబంధించి బండి సంజయ్‌ చుట్టూ రాజకీయం నడుస్తోంది. 


బండి సంజయ్ ఫోన్ ఇవ్వట్లేదు - సీపీ రంగనాథ్ 


పేప‌ర్ లీకేజీ వ్యవ‌హారంలో బండి సంజ‌య్ పాత్ర లేక‌పోతే ఫోన్ దాచిపెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఏముంది? ఆయ‌న ఫోన్ ఇస్తే కీల‌క స‌మాచారం బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఫోన్ ఎందుకు తేలేదు? ఆ ఫోన్ తెస్తే అంతా బ‌య‌ట‌ప‌డుతుంది..అని వరంగల్ సీపీ రంగనాథ్ చెబుతున్నారు. బండి సంజయ్ తన ఫోన్‌ను పోలీసులకు ఇవ్వలేదని లేదని చెబుతున్నారని ఆయన అంటున్నారు. కానీ బండి సంజయ్ తన ఫోన్ ను  ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తున్న సమయంలో కూడా ఉపయోగించిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. మరి పోలీసులు ఆయన ఫోన్‌ను ఎందుకు తీసుకోలేదు? తీసుకుకోకుండా ఇవ్వలేదని చెబుతున్నారా? అన్న సందేహాలు వస్తున్నాయి. బండి సంజయ్‌ను ఫోన్‌ గురించి అడిగితే లేదన్నారని సీపీ రంగనాథ్ అన్నారు. ఫోన్‌ ఇస్తే కీలక సమాచారం బయటకు వస్తుందని వారికి తెలుసని, అందుకే ఫోన్‌ ఇవ్వట్లేదన్నారు. అయినా బండి సంజయ్‌ ఫోన్‌కాల్‌ డేటా సేకరిస్తామని సీపీ తెలిపారు. పేపర్‌ షేర్‌ చేసిన అందరికీ ప్రశాంత్‌ ఫోన్‌ చేయలేదన్నారు. పిల్లల సాయంతో ప్రశ్నపత్రం లీక్ చేశారన్నారు. కొన్ని ఫోన్లలో మెసేజ్‌లు డిలీట్‌ చేశారని, వాటిని రిట్రైవ్‌ చేయాలన్నారు. కాల్‌ డేటా సేకరించాల్సి ఉందన్న సీపీ... ఎలాంటి కుట్ర చేయకపోతే బండి సంజయ్‌ ఫోన్‌ ఇవ్వొచ్చు కదా అని వరంగల్ సీపీ రంగనాథ్‌ ఇటీవల అన్నారు.