Bandi Sanjay On BRS : టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ పేరు ప్రకటించి పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటుచేశారు. బీఆర్ఎస్ ప్రకటనపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ విమర్శలు చేశారు. మెట్పల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన..  సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రకటించి, మీటింగ్ పెడితే ఒక్కరి మొహంలో కూడా నవ్వు లేదన్నారు. అది ఆవిర్భావ సభలా లేదని, సంతాప సభలా ఉందని విమర్శలు చేశారు. పార్టీ పేరు నుంచి, జెండా నుంచి తెలంగాణను తీసేశారన్నారు. బెంగళూరులో డిపాజిట్ రాని వాళ్లను తెచ్చుకుని బీఆర్ఎస్ మద్దతు అంటున్నారన్నారు. పార్టీ ప్రారంభించినప్పుడు ఏం చేస్తారో చెప్పాలన్నారు. సమైక్యవాది అయిన ఉండవల్లిని తీసుకొచ్చి దావత్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అని బండి సంజయ్ ఆరోపించారు. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ అంటూ కొత్త రాగం అందుకున్నారన్నారు.  కేసీఆర్ కు తెలంగాణ మీద మాట్లాడే అర్హత కోల్పోయారన్నారు. దిక్కు, దివానా లెనోళ్ళను, తుక్డే గ్యాంగ్ ను పట్టుకొచ్చి బీఆర్ఎస్ అంటున్నారని విమర్శించారు. 


గుజరాత్ విక్టరీ నుంచి దృష్టి మళ్లించేందుకే 


"BRS కాదు... బందిపోట్ల రాష్ట్ర సమితి. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిండు. పంజాబ్ లో రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లని పరిస్థితి. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు?. కేసీఆర్ కుటుంబం దోచుకుతిన్నది. కేసీఆర్ బిడ్డ కవిత ఢిల్లీలో లిక్కర్ దందా చేసింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ లిక్కర్ దందా చేస్తుందేమో చూడాలి. బిడ్డ లిక్కర్ దందా పక్కకు పోయేందుకే... BRS పార్టీ అంటూ నాటకాలు. జాతీయ పార్టీ పెడితే విధివిధానాలు ఉండాలి. కేవలం తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. గుజరాత్ లో బీజేపీ గ్రాండ్ విక్టరీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ ప్రకటన చేశారు. 'బీఆర్ఎస్' ఎప్పటికీ 'బంది పోట్ల రాష్ట్ర సమితి' నే. " -బండి సంజయ్ 


బూటకపు వాగ్దానాలు 


కృష్ణా జలాల్లో  కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణకు 575 టీఎంసీలు రావాల్సి ఉంటే...299 టీఎంసీలకే సంతకం చేసి, తెలంగాణ నోట్లో మన్ను కొట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు దండుకున్నారని ఆరోపించారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య పరస్పర కమీషన్ల అండర్స్టాండింగ్ ఉందన్నారు. రెండు రాష్ట్రాల నాయకులు కుట్రలతో సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇక్కడే ఏమి చేయలేని కేసీఆర్... దేశ రాజకీయాల్లో ఏం చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ వి అన్నీ బూటకపు వాగ్దానాలే అని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారో చెప్పాలన్నారు. కాషాయ జెండా కాంతిలో రంగురంగుల జెండాలు మాడి మసైపోతాయన్నారు. కాషాయ జెండా పవర్ అలాంటిదన్నారు.