Shabbir Ali : తెలంగాణ పోరాటంలో కేసీఆర్ పాత్ర ఏంలేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ ఒక్కరే తెలంగాణ తేలేదని, అమరుల త్యాగాల ఫలితoతోనే తెలంగాణ వచ్చిoదన్నారు. తమ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు షబ్బీర్. కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో బ్రిటిష్ వారి నిరంకుశత్వాన్ని ఎదిరించిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. 


వడ్డే ఓబన్న చరిత్ర పాఠ్య పుస్తకాల్లో 


అనంతరం స్థానిక ఫంక్షన్ హాలులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. వడ్డే ఓబన్న బ్రిటిష్ వారి నిరంకుశత్వాన్ని ఎదిరించిన స్వాతంత్ర సమరయోధుడని, తెల్ల దొరల అక్రమ పన్నుల వసూళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దిశాలి అని కొనియాడారు. నాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి కుడి భుజంగా ఉద్యమంలో ఓబన్న పాల్గొన్నారని చెప్పారు. భయం ఎరుగని వడ్డెర్లు, బోయలు, చెంచులతో  సంచార తెగల సైన్యాన్ని సమర్ధవంతంగా నడిపించారన్నారు. దట్టమైన నల్లమల అడవుల్లో ఈస్ట్ ఇండియా సైన్యాన్ని ఊచకోత కోసి ఉరుకులు పెట్టించడంలో ఓబన్న ముఖ్య పాత్ర పోషించారన్నారు.  అలాంటి వడ్డే ఓబన్న వీరత్వం సమాజం గుర్తించకపోవడం చాలా బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వడ్డే ఓబన్న చరిత్ర పాఠ్యపుస్తకాలు చేరుస్తామన్నారు.


అప్పుల తెలంగాణ 


టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని విస్మరించి ఉద్యమంలో లేని వారిని మంత్రులు చేసిందని షబ్బీర్ అలీ ఆరోపించారు. 60 సంవత్సరాల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటని, సోనియా గాంధీ పుణ్యంతో తెలంగాణ ఏర్పాటయ్యిందన్నారు. గడిచిన ఎనిమిదిన్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర లేదని, పైగా నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు తెలంగాణకు మిగిలిందన్నారు. టీఆర్ఎస్ ను బీఅర్ఎస్ గా మార్చి ఎవరిని ఒరగబెడతారని ప్రశ్నించారు.


అదానీ, అంబానీలే బాగుపడ్డారు 


ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లా అభివృద్ధి కోసం కేసీఆర్ దగ్గరి నుంచి నిధులు తెచ్చే దమ్ముందా అని షబ్బీర్ అలీ నిలదీశారు. కాళేశ్వరంపై విచారణ చేస్తే అవినీతి బయటపడుతుందన్నారు. బీజేపీ పాలనలో దేశం వెనుకబడి పోయిందని, దేశంలో ప్రజల అభివృద్ధి లేదు కానీ అదానీ, అంబానీలు బాగుపడుతున్నారన్నారు. ప్రపంచ ఆర్థిక సూచీలో దేశం 121 స్థానంలో ఉండటం సిగ్గు చేటన్నారు. రాహుల్ పాదయాత్రతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లలో కదలికలు మొదలయ్యాయన్నారు. జిల్లాలో సాగనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని కోరారు.