Kavitha :  ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఎదుట హాజరవడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాంను ఏడాదిగా సాగదీస్తున్నారని ఇంకా ఎంత కాలం అని ఆమె ప్రశ్నించారు. ఈడీ నోటీసులు అందిన మాటనిజమేనని.. కానీ వాటి గురించి తన లీగల్ టీం చూసుకుంటుందన్నారు. ఇది రాజకీయకక్షతో వచ్చిందేనని.. ఏడాది నుంచి టీవీ సీరియల్ మాదిరిగా నడిపిస్తున్నారని కవిత వ్యాఖ్యానించారు. ఈడీ నోటీసులపై తమ పార్టీ లీగల్ సెల్‌ వాటిని పరిశీలిస్తోందని.. న్యాయ నిపుణుల సలహాను అనుసరించి నిర్ణయం తీసుకుంటానని కవిత స్పష్టం చేశారు. ఎన్నికల సమయం కావడంతో కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసని మొదటి నుంచి చెబుతూనే వున్నామని కవిత  స్పష్టం చేశారు. 


ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్ గా మారి ఈడీకి స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ ఆరుణ్ రామచంద్ర పిళ్లైను కవిత బినామీగా ఈడీ చెబుతోంది.  ఢిల్లీ లిక్కర్ స్కామ్  లో  వరుసగా ఒకరి తర్వాత ఒకరు అప్రూవర్లుగా మారారు.  ముఖ్యంగా సౌత్ లాబీలో సీబీఐ, ఈడీ గుర్తించిన నిందితుల్లో ఒక్క కల్వకుంట్ల కవిత తప్ప దాదాపుగా అందరూ అప్రూవర్లు అయ్యారు. అంటే.. ఒక్క కవిత మాత్రమే నిందితురాలిగా మిగిలారు.  అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ గా మారారు.   ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. ఈయన కవిత తరపున బినామీగా వ్యవహరంచారని ఈడీ చెబుతోంది. ఆయన కూడా  గతంలో తాను కవిత బినామీనేనని అంగీకరంచారు. తర్వాత తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానన్నారు. మళ్లీ ఇప్పుడు పూర్తిగా మనసు మార్చుకుని అప్రూవర్ గా మారారు. కవిత మద్యం బినామీ వ్యాపారం మొత్తం పిళ్లై పేరు మీదుగా సాగిందని ఈడీ, సీబీఐ చెబుతున్నాయి. ఇప్పటికే  ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్లు అయ్యారు. వారిద్దరూ సౌత్ లాబీ నుంచి కీలకం. ఇక కవిత  ఆడిటర్ గా పని చేసిన బుచ్చిబాబు కూడా అప్రూవర్ అయ్యారని చెబుతున్నారు. ఆయన దగ్గర నుంచి ఇటీవల స్టేట్ మెంట్లు కూడా మళ్లీ తీసుకున్నారు. ఇక సౌత్ లాబీలో మిగిలింది కవిత మాత్రమే. ఇప్పుడు విచారణకు పిలవడంతో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. 
 
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో 2021, 2022లో రూపొందించిన ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. గతేడాది నవంబర్ 17న అమలులోకి వచ్చిన ఈ విధానంలో భాగంగా నగరాన్ని 32 జోన్‌లుగా విభజించి 849 షాపులకు సంబంధించి ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. ఈ విధానాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యతిరేకిస్తూ ఎల్‌జీకి ఫిర్యాదు చేశాయి. ఎల్‌జీ ఆదేశంతో మొదట సీబీఐ.. సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగాయి.  వరుసగా అరెస్టులు చేశాయి. అరబిందో శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్లైను బినామీగా పెట్టుకుని కవిత ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసినట్లుగా గుర్తించి కేసులు నమోదు చేసింది. విచారణ జరిపి దాఖలు చేసిన చార్జిషీట్‌లో కవిత బినామీ ఆస్తుల వివరాలనూ వెల్లడించింది.  


ఢిల్లీలో మద్యం వ్యాపారంలో సాధించిన లాభాలతో హైదరాబాద్‌లో కవిత భూములు కొనుగోలు చేశారని, ఇందులో సౌత్‌గ్రూపుదే కీలకపాత్ర అని ఈడీ కోర్టుకు తెలిపింది.  భూముల కొనుగోలు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కుమార్‌ ప్రమేయం ఉందని తెలిపింది. గౌతమ్‌ మల్హోత్రా, అమన్‌దీప్, మాగుంట రాఘవ, అరుణ్‌ పిళ్లై వాంగ్మూలాల ఆధారంగా రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది.