Jagruti Kavita :  సీబీఐ దాడులకు భయపడే ప్రశ్నే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి విస్తృత స్తాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ తరహా ఉద్యమాన్ని దేశమంతా విస్తరిస్తామని ప్రకటించారు.  మనం ఒక్క పిలుపు ఇస్తే ప్రతీ రాష్ట్రంలో మనకు ఒక శాఖ సిద్ధమవుతుందని  ధీమా వ్యక్తం చేశారు.  బీజేపీపై పోరాటం విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు.  తెలంగాణ ఆడబిడ్డల కళ్లలో నుంచి వచ్చేది నీళ్లు కాదు నిప్పులు వస్తాయన్నారు.  ఎవరు మాట్లాడితే వాళ్లపైకి సీబీఐ వస్తోంది.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి.. నాపై కూడా సీబీఐ దాడులు జరుగుతున్నాయి.. దాడులకు నేను భయపడనని ప్రకటించారు.  


దేశంలో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి పోరాటం 


దేశంలో ఉన్నటువంటి సమస్యలపై తెలంగాణ జాగృతి పోరాడుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు.  ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, రైతులు, కళాకారులను, కవులను  ఏకం చేసుకుని ముందుకెళ్తామన్నారు.తెలంగాణ సాహిత్యం, సంస్కృతిని  జాగృతి  కాపాడుతోందన్నారు.  జాగృతి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశామన్నారు. తెలంగాణ జాగృతికి జయశంకర్ సార్, కేసీఆర్ లు గురువులన్నారు. 8 ఏళ్లలో పరిపుష్టమైన కార్యక్రమాలను నిర్వహించుకున్నామన్నారు. ఆనాడు బతుకమ్మను ఎత్తుకోవాలంటే సిగ్గుపడ్డారన్నారు.  మన కళలు, సంస్కృతిని పాఠ్యాంశాల్లో చేర్చుకున్నామన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటామన్నారు. మన పండుగలను, కళలను కాపాడుకున్నామని కవిత అన్నారు.


సీబీఐ ఇబ్బంది పెడుతున్నా వెనక్కి తగ్గేది లేదు !


కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సీబీఐ, ఈడీ దాడులు చేస్తూ... తమ సమయాన్ని వృథా చేస్తుందన్నారు. ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. రెస్ట్ తీసుకోను..రిలాక్స్ కూడా తీసుకునేది లేదన్నారు. తెలంగాణ ఆడబిడ్డల కళ్ల నుంచి నీళ్లు రావని..నిప్పులొస్తాయని అన్నారు. తెలంగాణ జాగృతి నుంచి అన్ని రాష్ట్రాలకు వెళ్తామన్నారు. రాష్ట్రానికి  జరిగిన అన్యాయంపై .. ఉద్యమ స్పూర్తితో  దేశంలోని సమస్యలపై పోరాడతామన్నారు. ఫోర్ట్ ఎస్టేట్ అయిన మీడియా ప్రైవేట్ ఎస్టేట్ గా మారిందని కవిత అన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కూల్చేస్తుందని ఆరోపించారు. కేంద్రం కుట్రలను మీడియా ఎత్తి చూపాలకానీ  లీకులిచ్చి  వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.  దళిత విద్యార్థులకు దేశంలో ఎక్కడా స్కాలర్ షిప్ ఇవ్వడం లేదన్నారు.  


ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరోసారి కవితను ప్రశ్నించనున్న సీబీఐ 


సీబీఐ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను మరోసారి ప్రశ్నించనున్నారు. సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం నోటీసులు ఇచ్చారు. ఈ సారి కవితను ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో కవిత వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ప్రస్తుతానికి ఆమెను సాక్షిగానే విచారించారని.. ముందు ముందు నిందితురాలిగా మార్చవచ్చన్న ఊహాగానాలు ఎక్కువగా  వినిపిస్తున్నాయి. 


నిబంధనల ప్రకారమే పవన్ పొలిటికల్ వార్ ట్యాంక్ వారాహీ - రిజిస్ట్రేషన్ కూడా పూర్తి !