KA Paul Meets Amit Shah: తెలంగాణలో అన్యాయం జరుగుతోందని, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ తనపై దాడులు చేయిస్తున్నారంటూ ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను (Amit Shah) కేఏ పాల్ కలిశారు. అనంతరం కేఏ పాల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని, అలాంటి స్థాయిలో తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. అమిత్ షాతో తాను అనేక విషయాలను చర్చించానని చెప్పారు. కేసీఆర్ అవినీతి, కేటీఆర్ అక్రమాలు వారి దాడులు, రూ.లక్షల కోట్లు మాయమయ్యాయని ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు.  


దేశ ఆర్థిక పరిస్థితులపై అమిత్ షాతో మాట్లాడానని చెప్పారు. దేశం శ్రీలంక లాగా అయిపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పు దాదాపు రూ.8 లక్షల కోట్లు, తెలంగాణ అప్పు రూ.నాలుగున్నర లక్షల కోట్లుగా ఉందని ఆందోళన చెందారు. తెలంగాణలో తన పైన జరిగిన దాడిని కేంద్ర మంత్రులు సహా అమిత్ షా కూడా ఖండించారని అన్నారు. రెండు రోజుల్లో తాను తెలంగాణకు వస్తున్నట్లుగా అమిత్ షా చెప్పారని.. తనకు భరోసా ఇచ్చారని అన్నారు.


చైనా జీడీపీ ఇండియా జీడీపీ 33 ఏళ్ల క్రితం ఒకేలా ఉండేవని, ఇప్పుడు చైనా జీడీపీ ఆరు రెట్లు మన దేశం కన్నా ఎక్కువగా ఉందని కేఏ పాల్ గుర్తు చేశారు. ప్రజాశాంతి పార్టీ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా పోటీ చేస్తుందని.. పోరాటం చేస్తుందని అన్నారు. ‘‘తెలంగాణ డీజీపీ కలుస్తాను అంటే సమయం ఇవ్వలేదు కానీ కేంద్ర హోంమంత్రి అడగగానే అపాయింట్ మెంట్ ఇచ్చారు. నన్ను ప్రధాని మోదీని కలవమని సూచించారు. ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు నాకు ఇచ్చే గౌరవాన్ని మీరు చూడొచ్చు. వారందరికీ వందనాలు. తెలంగాణ ప్రజలకు ఒకటే చెబుతున్నాను. కేసీఆర్ కేటీఆర్ అవినీతి చెల్లదు. నాపైన కేసీఆర్ దాడి చేయించారు అంటే దాని పరిణామాలు త్వరలో చూస్తారు.’’ అంటూ కేఏ పాల్ అన్నారు.


అంతేకాకుండా, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నేడు మధ్యాహ్నం (మే 13) ఒంటి గంటకు కేఏ పాల్ విలేకరులతో మాట్లాడనున్నారు. తనకు Z Plus సెక్యూరిటీ కల్పించాలని పాల్ కోరారు. కేసీఆర్ అవినీతి పాలనపై విచారణ జరపాలని, లేదంటే తెలంగాణ శ్రీలంకలా అయిపోతుందని పాల్ అమిత్ షాకు ఫిర్యాదు చేశారు.