Kavitha News :  సీబీఐ   ప్రత్యేక కోర్టులో  బీఆర్ఎస్  ఎంఎల్‌సి కవితకు ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ పాలసీ పై సీబీఐ దాఖలు చేసిన కేసులో  కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు.  ఎంఎల్‌సి కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. జులై 7వరకు కస్టడీ పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 


మార్చి పదిహేనో తేదీన అరెస్టయిన కల్వకుంట్ల కవిత                                        


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆమె జ్యుడిషియల్ కస్టడీలోభాగంగా న్యూఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. బెయిల్ కోసం న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు. ఆ తర్వాత ఇదే కేసులో ఆమెను సీబీఐ సైతం విచారించి అరెస్టు చూపించింది.   మరోవైపు ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది కానీ.. ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. 


బెయిల్ కోసం న్యాయపోరాటం చేస్తున్న కవిత                         


కవిత బెయిల్ కోసం ఆమె తరపు న్యాయవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.  కనీసం మధ్యంతర బెయిల్‌ కూడా దక్కలేదు. బీఆర్‌ఎస్‌ పార్టీ న్యాయ విభాగం కూడా శ్రమిస్తోంది.  ఇటీవల కవిత కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ.. ఆమెకు బెయిల్ లభించలేదు. తనను అక్రమంగా అరెస్టు చేశారని.. ఇది మనీలాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసని అప్పట్లో కవిత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇప్పుడు ఆమె కస్టడీని కూడా కోర్టు పొడిగిస్తూ వస్తోంది. 


కవితే ప్రధాన నిందితురాలని ఈడీ, సీబీఐ వాదనలు                              


ఈ కేసులో కవితే ప్రధాన నిందితురాలని, ఆమెకు బెయిల్ వస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ వాదిస్తూ వస్తోంది. కాగా.. ఈమేరకు ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. కాగా.. ఈ కేసులో 100 కోట్ల ముడుపులు చేతులు మారాయని.. అందులో కీలక సూత్రధారి, పాత్రధారి కవితేనంటూ ఈడీ, సీబీఐ అధికారులు స్పష్టం చేస్తున్నారు. చార్జిషీట్లలోనూ ఇదే విషయం చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన వారు సుదీర్ఘ కాలంగా జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనష్ సిసోడియా అరెస్ట్ అయి ఏడాది దాటిపోయింది. కేజ్రీవాల్‌కు బెయిల్ లభించడం లేదు. ఆయన సీఎం పదవికి కూడా రాజీనామా చేయడం లేదు. అప్రూవర్లుగా మారిన ఇతర నిందితులు మాత్రం బెయిల్ తెచ్చుకున్నారు.