Jubilee Hills by-election results KTR Reaction: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో ప్రజాతీర్పును స్వాగతిస్తున్నామని కేటీఆర్ ప్రకటించారు. ఫలితాల తర్వాత తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు ఓటేసిన ప్రజలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. గెలవాలనే లక్ష్యంతోనే ఎన్నికల్లో కొట్లాడామని.. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ తన పాత్రను అద్భుతంగా పోషించిందన్నారు. ఈ ఉపఎన్నిక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. గట్టి పోటీ ఇచ్చి 38 శాతానికిపైగా ఓట్లు సాధించామన్నారు. ఎలా చూసినా తామే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అని.. డిపాజిట్ కోల్పోయినపార్టీ కూడా ఉంది కదా అని బీజేపీని ఉద్దేశించి అన్నారు. బీహార్ లో కాంగ్రెస్ పూర్తిగా తన ఉనికిని కోల్పోయింది.. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితంతో నిరాశపడాల్సిన అవసరం లేదు. తెలంగాణలో కేసీఆర్ మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకూ శక్తివంచన లేకుండా కష్టపడుతామన్నారు.
వారికి తోడుగా ప్రతి బూత్లో స్థానిక జూబ్లీహిల్స్ పార్టీ శ్రేణులు, నాయకులు కూడా కష్టపడ్డారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. వారు కూడా మా అభ్యర్థికి రాజకీయ అనుభవం లేకపోయినా, చాలా కష్టపడి ఎన్నికల్లో గెలుపు కోసం పోరాటం చేశారన్నారు. గత రెండు సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ఎత్తిచూపడంలో...ఎన్నికల్లో మా పార్టీ నిజాయితీగా, చిత్తశుద్ధిగా పోరాడింది. ప్రతి సర్వేలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అన్ని సర్వే ఏజెన్సీలు చెప్పాయి. చివరి మూడు రోజుల్లో ఏం జరిగిందో అందరూ చూశారన్నారు.
ఈ ఎన్నిక ద్వారా స్పష్టమైన ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితి అని ప్రజలు తీర్పునిచ్చారు. ఈ అంశాన్ని సానుకూల అంశంగా పార్టీ పరిగణిస్తున్నది. 2014 నుంచి 2023 వరకు 7 ఉప ఎన్నికలు జరిగాయి. అన్ని ఉప ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఒక్క ఉప ఎన్నికల్లోనూ గెలవలేదని గుర్తుచేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఒకటి, రెండు సీట్లకే పరిమితమైంది. ఒక్క ఉప ఎన్నికల్లో గెలవకపోయినా, డిపాజిట్లు కోల్పోయినా అప్పటి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను, ఆరు గ్యారెంటీల అమలును, ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయామమని తెలిపారు. కులము, మతము పేరుతో రాజకీయం చేయలేదు. ప్రజలకు అవసరమైన అంశాలను మాత్రమే ప్రచారంలో చర్చకు పెట్టామన్నారు.
మంత్రివర్గంలో మైనారిటీలకు స్థానం లేదని, ఆటోలకు జరుగుతున్న అన్యాయం పైన మా పార్టీ గళమెత్తితే, ప్రభుత్వం ఒత్తిడికి లోనై వారికి స్థానం కల్పించాల్సి వచ్చింది.గెలవాల్సింది పార్టీలు కాదు, గెలవాల్సింది ప్రజలు అని నమ్మే పార్టీ మాది. ఎన్ని రకాలుగా అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడిందో నెల రోజుల ముందు చెప్పాం. స్వయంగా అభ్యర్థి తమ్ముడికి దొంగ ఓట్లు ఉండడం, దొంగ ఓటరు కార్డుల పంపిణీ, షెడ్యూల్ మొదలు పోలింగ్ రోజు వరకు జరిగిన అక్రమాల గురించి ఎన్నికల కమిషన్కు అనేక ఫిర్యాదులు చేశామన్నారు. ఏదేమైనా ప్రజా తీర్పుని మేము గౌరవిస్తాం.ఈ ఎన్నిక ఫలితం పైన కూడా ఆత్మ విమర్శ చేసుకుంటామన్నారు. మాకు ఈ ఎన్నికల్లో మంచి ఓటింగ్ వచ్చింది. సింగిల్ డిజిట్లో ఉండి డిపాజిట్ బీజేపీ కోల్పోయింది. ఈ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టుగానే కనిపిస్తున్నదన్నారు. ఈ ఎన్నికతో నిరాశ చెందవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఉనికి కోల్పోయే పరిస్థితిలో ప్రజలు తీర్పునిచ్చారు. ఎన్నిక తర్వాత కూడా ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ఎండగట్టే పనిలో నిమగ్నమై ముందుకు పోదామని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన మాదిరి ఇక్కడ కూడా పార్టీ మారిన నేతలను డిస్క్వాలిఫై చేసి ఉప ఎన్నికలు వస్తాయి అని ఆశిస్తున్నామమని.. ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకే ఇన్ని అపసోపాలు పడిన కాంగ్రెస్ పార్టీ, 10 ఉప ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కొంటుందో చూస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే బలంగా కొట్లాడతామన్నారు.