Jitta Balakrishna Reddy: బీజేపీ పార్టీని బలహీనపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్, రఘునందన్ రావు, విజయశాంతి తదితర నేతలపై ఏం చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేదా అని ఉద్యమకారుడు, పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన జిట్ట బాలకృష్ణ ఆరోపించారు. గన్ పార్క్ వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ క్రమంలోనే తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మునుగోడు ఎన్నికల తర్వాత పార్టీ గప్ చుప్ కావడానికి కారణమేమిటి?.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన బండి సంజయ్ ని ఎందుకు తొలగించారు?.. అని రాష్ట్ర నేతల్ని ప్రశ్నించారు.


ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం ఏమైందని ప్రశ్నిస్తే తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఇదే సమయంలో తానెక్కడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తాను ఇతర పార్టీ నేతలతో కిషన్ రెడ్డి మాదిరిగా లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకోలేనని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కిషన్ రెడ్డి తనను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే కవిత కేసును నిర్వీర్యం చేశారని ఈ ఒప్పందంలో భాగంగానే కిషన్ రెడ్డి కి బీజేపీ అధ్యక్ష పదవి వచ్చిందని జిట్ట బాలకృష్ణ ఆరోపించారు. హిందుత్వ పార్టీగా చెప్పుకొనే బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఎందుకు సస్పెన్షన్ ఎత్తివేయడం లేదని ఆయన ప్రశ్నించారు.