Jagityala News : జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. జిల్లాలోని ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలోని చెరువులో ఈతకు(Swimming) వెళ్లి ముగ్గురు విద్యార్థుల ప్రమాదవశాత్తు మునిగిపోయారు. పోలీసుల వివరాల ప్రకారం ఆదివారం ఉదయం గొలుసుల యశ్వంత్‌(13), మారంపల్లి శరత్‌(14), పబ్బతి నవదీప్‌(10) గ్రామంలోని చెరువులో ఈతకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు చిన్నారులు(Students Died) నీటిలో మునిగిపోయారు. అటుగా వెళ్తున్న స్థానికులు యశ్వంత్‌ మృతదేహాన్ని గుర్తించారు. కాసేపటి తర్వాత మరో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సీఐ కోటేశ్వర్‌ ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


ఇటీవల వరంగల్ లో విషాద ఘటన  


వరంగల్ జిల్లా నర్సంపేట గ్రామం చిన్న గురిజాల గ్రామానికి చెందిన వెంగళదాసు కృష్ణమూర్తి మార్చి 14న  ఆదివారం కావడంతో తన మనవళ్లు దీపక్, కార్తీక్‌లతో పాటు కొడుకు నాగరాజుతో కలిసి  వ్యవసాయ బావివద్దకు వెళ్లారు. అక్కడ మొక్కజొన్న చేను కోసిన తర్వాత వాటిని బస్తాల్లో నింపారు. ఆ తర్వాత స్నానం చేసేందుకు పక్కనే ఉన్న ఓ బావి వద్దకు తన మనవళ్లతో పాటు కృష్ణమూర్తి చేరుకున్నారు. ముందుగా తన పెద్ద మనవడు కార్తీక్‌కు స్నానం చేయించి ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత దీపక్‌ను తీసుకువెళ్లి స్నానం చేయిస్తుండగా దీపక్ అకస్మాత్తుగా కాలు జారీ నీళ్లలో పడ్డాడు. అయితే బావి లోతుగా ఉండడంతో మనవడు మునిగిపోతుండడం చూసిన కృష్ణమూర్తి వెంటనే నీళ్లలోకి దిగాడు. తనకు ఈత రాకున్న మనవడిని కాపాడాలనే కంగారులో నీళ్లలోకి దూకారు. దీంతో ఇద్దరు నీళ్లలో మునిగిపోవడంతో  గట్టుపై ఉన్న  మరో మనవడు కార్తీక్ వెంటనే తన తండ్రిని అప్రమత్తం చేశాడు. గట్టిగా కేకలు వేసి తండ్రి నాగరాజును తీసుకువచ్చాడు. దీంతో నాగరాజు సైతం ఏ మాత్రం ఆలోచించకుండా తనతండ్రితో పాటు కొడుకును కాపాడుకునేందుకు నీళ్లలోకి దూకాడు. దీంతో ముగ్గురికి ఈత రాకపోవడంతో ప్రాణాలు వదిలారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి. ఒకరిని కాపాడేందుకు వెళ్లి మరోకరు ప్రాణాలు వదలడం అది కూడా ఒకే కుటుంబానికి చెందిన తాత, తండ్రి కొడుకులు కావడం మరింత హృదయవిదారకంగా మారింది. ఒకే కుటుంబంలో మూడు తరాల వ్యక్తులు చనిపోవడంతో ఆ గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.  


కాలువలో కొట్టుకుపోయిన చిన్నారులు 


మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తౌర్యాతండా గ్రామం శివారు దుబ్బతండా వద్ద ఎస్సారెస్పీ కాల్వలో పడి దారవత్ రమ్యశ్రీ (7), దారవత్ వసంతి (9) ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు. ఎస్ ఆర్ఎస్పీ కాలువ వద్దకు ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారులను మృత్యువు మింగేసింది. దుబ్బతాండకు చెందిన నలుగురు చిన్నారులు సరదాగా ఆడుకునేందుకు కాలువలోకి దిగారు. కాలువను దాటేందుకు ఏర్పాటు చేసిన రక్షణ తాడును పట్టుకుని కొద్ది సమయం పాటు చిన్నారులు ఆడుకుని కేరింతలు కొట్టారు. ఇంతలోనే అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరిగి తాడు తెగిపోవడంతో చిన్నారులు కాలువలో కొట్టుకుపోయారు. నలుగురు చిన్నారులు కొట్టుకుపోవడాన్ని గమనించిన ఆ గ్రామానికి చెందిన యువతి కేకలు వేయడంతో మిర్చి తోటలో పనిచేస్తున్న చిన్నారులు లోకేష్, చరణ్ తేజ్ లో కాలువ దగ్గరకు చేరుకున్నారు. ఈ ఇద్దరు చిన్నారులు సాహసం చేసి మొదటగా కాలువలో కొట్టుకుపోతున్న హిందు(8), వైష్ణవిలను (12) కాపాడారు. ఇంతలోపే దారావత్ రమ్య శ్రీ (7), దారావత్ వసంతిలు కాలువలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి చనిపోయారు.