Jaggareddy alleged that  a conspiracy behind the CBI notices to Kavitha  :  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కవితను నిందితురాలిగా చేరుస్తూ సీబీఐ ఇచ్చిన  నోటీసులతో కాంగ్రెస్ ఉలిక్కి పడింది. మామూలుగా అయితే బీఆర్ఎస్ డిఫెండ్ చేసుకోవాలి. కానీ ఈ నోటీసుల వెనుక కుట్ర ఉందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెర ముందుకు వచ్చారు. లిక్కర్ స్కామ్‌లో కవితను నిందితురాలిగా చేర్చడం ఓ డ్రామా అన్నారు. లోక్‌సభ ఎన్నికల కోసమే ఈ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారన్నారు. కవితను అరెస్టు చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ రోడ్డెక్కుతుందన్నారు. సింపతీతో ఎంపీ సీట్లు గెల్చుకోవాలని  బీఆర్ఎస్ ప్లాన్ అని జగ్గారెడ్డి ఆరోపించాు. కాంగ్రెస్‌కు వచ్చే సీట్లు గండి కొట్టేలా.. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్లాన్ చేస్తున్నాయన్నారు. 



 హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు.  కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని.. కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకతీరు.. హైదరాబాద్ వచ్చాకా ఇంకో తీరుగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ మీద ఏదో ఒక నింద వేయాలని కిషన్ రెడ్డి చూస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేసేలా కిషన్ రెడ్డి మాటలు ఉన్నాయన్నారు. ఢిల్లీ రాజకీయం అంతా పొల్యూషన్ అయ్యిందని.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా.. ఫ్రెష్ పాలిటిక్స్ ఉన్నాయన్నారు. మతంతో రాజకీయం చేయాలని బీజేపీ చూస్తోందని, అలాంటి పార్టీకి బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. మోడీ పెట్టిన అన్ని బిల్లులకు కేసీఆర్‌ మద్దతు ఇచ్చారన్నారు. మోడీ, కేసీఆర్ మధ్య రాజకీయ ప్రేమాయణం నడిచిందన్న జగ్గారెడ్డి.. వారి మధ్య ఏం చెడిపోయిందో కానీ రెండేళ్లు గ్యాప్ వచ్చినట్టు నటించారన్నారని ఆరోపించారు.


కిషన్ రెడ్డి డీజిల్ ధర పెంచినం అని చెప్పగలడా..? పెట్రోలు పెంచింది మేమే అని చెప్పగలడా..? గ్యాస్ ధర పెంచింది మీరే కదా..? అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. తప్పులు కప్పి పుచ్చుకోవడానికి కాంగ్రెస్‌పై బీజేపీ నిందలు వేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తుందో కిషన్‌రెడ్డి తెలుసుకుంటున్నారా లేదా అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారో రోజుకోకటి చెప్తానన్నారు. రెండేళ్ల క్రితం సమ్మక్క సారాలమ్మ జాతరకు జేంద్ర మంత్రి అర్జున్ ముండా వెళ్లి జాతీయ జాతరగా ప్రకటిస్తామన్నారని.. ఇప్పుడు కిషన్ రెడ్డి మేడారం వెళ్లి.. జాతీయ పండుగలు చేస్తాం అని చెప్పలేదు అన్నారని జగ్గారెడ్డి తెలిపారు. అమ్మవారి వద్దకు కూడా రాజకీయ లబ్దిపొందేందుకే వెళ్ళారా అంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు.


అమ్మవార్ల త్యాగాలకు గుర్తింపు లేదా అని ప్రశ్నించారు. నాలుగు రాష్ట్రాల ప్రజలు వస్తారు.. అందుకే జాతీయ పండుగగా గుర్తించాలని డిమాండ్ ఉందన్నారు. అమ్మవారి గుడి ముందే ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు.. ఇంకేం కావాలి సాక్ష్యం అంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు. మీరే జాతీయ పండగ చేస్తాం అన్నారు.. మీరే అలాంటివి లేవు అంటారు.. కేంద్ర మంత్రులు ఇన్ని అబద్దాలు చెప్తారా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. బాధ్యత కలిగిన మంత్రులు ఇన్ని అబద్దాలు చెప్తారా అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. పదేళ్ల నుంచి ప్రజలను బీజేపీ నేతలు మోసం చేస్తూనే ఉన్నారన్నారు. మూడు ఎంపీలు కూడా గెలవకపోతే ఇబ్బంది ఐతది అని బీజేపీ నేతలకు భయం పట్టుకుందన్నారు.