Irctc Special Package For Ooty: వేసవిలో పిల్లలకు పరీక్షలు అయిపోయిన తర్వాత చాలా మంది టూర్ ప్లాన్ చేస్తుంటారు. ఈ వేసవి మరింత చల్లగా ఉండాలనుకునే వాళ్లు మాత్రం ఫస్ట్ ఛాయిస్‌లో ఊటీ ఉంటుంది. ప్రపంచవ్యాప్త పర్యాటక రంగంలోనే ఊటీకి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే టూర్‌ ప్రొవైడర్ల లిస్ట్‌లో కచ్చితంగా ఊటీ ఉంటుంది. అందుకే ఊటి వెళ్లే వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్లాన్ చేసింది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని ఊటి ప్రకృతి అందాలకు నెలవుగా ఉండడమే కాకుండా.. వేసవిలో పర్యాటకులకు ఓ చక్కటి అనుభూతిని కలిగిస్తుంది. నీలగిరి కొండల్లో ఉన్న మెయిన్ హిల్ స్టేషన్. దీన్ని క్వీన్‌ ఆఫ్‌ హిల్‌ స్టేషన్ అంటారు. ఇక్కడకు రోడ్డు, రైల్వే, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఇక్కడ ఉండే ప్రకృతి సౌందర్యం సందర్శకులను మైమరిపిస్తుంది.


ఐఆర్ సీటీసీ ప్యాకేజీ వివరాలివే


ఊటీకి ఐర్ సీటీసీ Ultimate Ooty Ex-Hyderabad పేరుతో వేసవి కోసం ప్రత్యేక ప్యాకేజీ డిజైన్ చేసింది. ఈ ప్యాకేజీలో ఊటీతోపాటు కూనూర్ కూడా కవర్ చేస్తుంది. ఈ ప్యాకేజీ కేవలం సికింద్రాబాద్ నుంచే ప్రారంభమవుతుంది. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:20 గంటలకు రైలు  అందుబాటులో ఉంటుంది. పర్యాటకులు స్లీపర్ లేదా థర్డ్ ఏసీలో ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ముగ్గురు లేదా అంతకన్నా తక్కువ ప్రయాణికులకు ఒక ధర, ముగ్గురి నుంచి ఆరుగురి వరకూ ఉంటే మరో ట్యారిఫ్ వసూలు చేయనుంది. పిల్లలకు బెడ్ కావాలనుకుంటే ఒక ధర, లేకుంటే మరో ధర ప్రకటించింది. 5 రాత్రుళ్లు, 6 పగళ్లు ఈ టూర్ ఉంటుంది.


ధరలు ఇవే!


ముగ్గురు ప్రయాణికుల లోపు ఉంటే (ఒకటి నుంచి ముగ్గురు ఉంటే).. స్లీపర్ లో స్టాండర్డ్ ధర ప్రకారం సింగిల్ షేరింగ్ లో ఒక్కొక్కరికీ రూ.30,560 కాగా, ట్విన్ షేరింగ్ రూ.16,020, ట్రిపుల్ షేరింగ్ ధర రూ.12,410గా ఐఆర్ సీటీసీ నిర్ణయించింది. అదే థర్డ్ ఏసీ విభాగంలో సింగిల్ షేరింగ్ లో రూ.33,020, ట్విన్ షేరింగ్ రూ.18,480, ట్రిపుల్ షేరింగ్ లో రూ.14,870 ధరగా ఖరారు చేసింది. అదే 5 నుంచి 11 ఏళ్ల లేపు పిల్లలకు స్లీపర్ స్టాండర్డ్ బెడ్ తో రూ.6,970 కాగా, బెడ్ లేకుండా రూ.6,730గా నిర్ణయించారు. అలాగే, థర్డ్ ఏసీలో బెడ్ లేకుండా రూ.9,180గా ధర నిర్ణయిస్తే, బెడ్ తో రూ.9,430గా నిర్ణయించింది.


నలుగురి నుంచి ఆరుగురు ప్రయాణికుల వరకూ.. స్లీపర్ లో స్టాండర్డ్ ధర ప్రకారం ట్విన్ షేరింగ్ రూ.14,470, ట్రిపుల్ షేరింగ్ లో రూ.12,120 ధరగా ఐఆర్ సీటీసీ నిర్ణయించింది. అదే థర్డ్ ఏసీ విభాగంలో ట్విన్ షేరింగ్ రూ.16,930, ట్రిపుల్ షేరింగ్ లో రూ.14,580 గా ఛార్జీలు ఖరారు చేసింది. ఇదే విభాగంలో పిల్లలకు బెడ్ లేకుండా రూ.9,180గా ధర నిర్ణయిస్తే, బెడ్ తో రూ.9,430గా ధర నిర్ణయించింది. అదే, స్లీపర్ స్టాండర్డ్ లో పిల్లలకు బెడ్ తో రూ.6,970 కాగా, బెడ్ లేకుండా రూ.6,730గా నిర్ణయించారు.


ప్రయాణం వివరాలివే


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తొలి రోజు (మంగళవారం) మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రారంభమైన రైలు మర్నాడు ఉదయం 8 గంటలకు కోయంబత్తూరు చేరుకుంటుంది. అక్కడ స్టేషన్ లో దిగి హోటల్ లో చెకిన్ అవ్వాలి. మధ్యాహ్నం వేళ బొటానికల్ గార్డెన్స్, ఊటీ సరస్సు చూసి రాత్రికి ఊటీలోనే బస చేయాలి. మూడో రోజు దొడబెట్టా పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ సందర్శన అనంతరం రాత్రికి ఊటీలోనే బస. నాలుగో రోజు కూనూర్ లో సైట్ సీయింగ్ ఏర్పాటు ఉంటుంది. ఐదో రోజు హోటల్ లో ఉదయం అల్పాహారం అనంతరం మధ్యాహ్నం చెక్ అవుట్ అయ్యి కోయంబత్తూరు స్టేషన్ కు చేరుకోవాలి. ఆ రోజు సాయంత్రం రైలులో 4:35 గంటలకు ఆరో రోజు రాత్రి 12:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.


ఈ టూర్ ప్యాకేజీలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. లంచ్, డిన్నర్ ప్రయాణికులే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఏసీ వసతి సదుపాయం, స్టేషన్ నుంచి వెళ్లి రావడానికి ఏసీ వాహన సదుపాయం ఉంటుంది. మరిన్ని వివరాలకు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ www.irctcrourism.com ను సందర్శకులు చూడగలరు.