8 Junior Colleges Affiliation Cancellation: హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణతో పాటు ప్రజా భద్రతపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ  పేరుతో భారీ గోల్ మాల్  యత్నం వెలుగులోకి రావడం కలకలం రేపింది. హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ ,  అగ్నిమాపక శాఖ డీజీ సంతకాలను ఫోర్జరీ చేసి , నకిలీ ఫైర్ ఎన్‌ఓసీ  లను ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించిన వ్యవహారంలో 8 ప్రముఖ ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాలపై లేక్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఈ కళాశాలలపై క్రిమినల్ చర్యలతో పాటు, వాటి అనుబంధ గుర్తింపును  తక్షణమే రద్దు చేయాలని అధికారులు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

Continues below advertisement

ఇంటర్మీడియట్ విద్యాసంస్థల అనుమతులు పొందేందుకు అగ్నిమాపక శాఖ నుంచి పొందే ఫైర్ సెక్యూరిటీ ఎన్ఓసీలు అత్యంత ప్రామాణికం. అయితే, ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించకుండా, అగ్నిమాపక యంత్రాలు అమర్చకుండానే అనుమతులు పొందాలనే దురుద్దేశంతో కొందరు ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు, మధ్యవర్తులతో చేతులు కలిపారు. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డీజీ సంతకాలను హూబహూ ఫోర్జరీ చేసి, నకిలీ లెటర్ హెడ్‌లపై ఫేక్ ఫైర్ NOC సర్టిఫికేట్లను సృష్టించి బోర్డు అధికారిక పోర్టల్‌లో అప్‌లోడ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో రుజువైంది.

ఫోర్జరీ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో  హైందవీ జూనియర్ కాలేజీ, రెసోనెన్స్ జూనియర్ కాలేజీ, ప్రియాంక జూనియర్ కాలేజీ, మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజీ, శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, న్యూ ఎరా జూనియర్ కాలేజీ, షాహీన్ జూనియర్ కాలేజీ, వశిష్ట జూనియర్ కాలేజీలపై కేసులు పెట్టారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు నిర్వహించిన వార్షిక తనిఖీలు ,  డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో ఈ నకిలీ ఎన్‌ఓసీల దందా గుట్టు రట్టయింది. క్యూఆర్ కోడ్‌లు, ఫైల్ నంబర్లు మ్యాచింగ్ కాకపోవడంతో సందేహం వచ్చిన ఇంటర్ బోర్డు అధికారులు నేరుగా హైడ్రా,  అగ్నిమాపక శాఖలకు సమాచారం అందించారు. ఈ పత్రాలు తమ శాఖ నుంచి జారీ కాలేదని, సంతకాలు సైతం ఫోర్జరీకి గురయ్యాయని ధ్రువీకరించుకున్న కమిషనర్ రంగనాథ్.. ఈ దగాకోరు చర్యలను తీవ్రంగా పరిగణించి లేక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు.

Continues below advertisement

ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే హైడ్రా మరియు అగ్నిమాపక శాఖల ఐపీఎస్ అధికారుల సంతకాలనే ఫోర్జరీ చేయడానికి సాహసించడంపై పోలీసు ఉన్నతాధికారులు కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఈ కుంభకోణం వెనుక ఉన్న కళాశాల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లతో పాటు ఈ నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసిన ఏజెంట్లు, డెస్క్‌టాప్ పబ్లిషింగ్  సెంటర్ నిర్వాహకులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. వేలాది మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ, ఫోర్జరీకి పాల్పడిన ఈ కాలేజీలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, కాలేజీల గుర్తింపు రద్దు చేసి సీజ్ చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.