YSRTP News: వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) అరెస్టు తీరు రాజకీయ నాయకుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలకు దారి తీస్తోంది. షర్మిల అరెస్టైన విధానంపై బీజేపీ నేతలు సంఘీభావం తెలుపుతుండగా, కవిత దానిపై సెటైర్లు వేశారు. తాము వదిలిన “బాణం” తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు” అంటూ కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించగా, ఈ ట్వీట్‌పై వైఎస్ షర్మిల అంతకు మించిన స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. పాదయాత్రలు చేసింది లేదని, ప్రజల సమస్యలు చూసింది లేదని కవితను విమర్శించారు.






‘‘పాదయాత్రలు చేసింది లేదు.. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు’’ అని వైఎస్ షర్మిల, కవిత ట్వీట్‌కు కామెంట్‌లో రాశారు.






గవర్నర్ కూడా మద్దతు


తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Sounderarajan) కూడా షర్మిల అరెస్టు వ్యవహారం పట్ల సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం పుదుచ్చేరి పర్యటనలో ఉన్న గవర్నర్ తమిళిసై షర్మిలకు మద్దతు తెలుపుతూ తెలుగు, ఇంగ్లీషుల్లో వరుస ట్వీట్లు చేశారు. ఆమె కారులో ఉన్నప్పుడు కారునే లాక్కొని వెళ్తున్న దృశ్యాలు కలవరపెట్టాయని అన్నారు.


‘‘వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రీమతి వైఎస్ షర్మిల అరెస్టుపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కారు లోపల ఉన్నప్పుడు ఆ కారును దూరంగా లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయి’’ అని ట్వీట్ చేశారు.


బీజేపీ నేతలు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటివారు షర్మిల అరెస్టును ఖండించిన సంగతి తెలిసిందే. పోలీసులు తరలిస్తున్న వీడియోను పోస్ట్ చేసిన కిషన్ రెడ్డి, ఓ మహిళ అని కూడా చూడకుండా షర్మిలను కారులో ఉండగానే ఆ కారును క్రేన్ తో లాక్కెళ్లడం దారుణమని అన్నారు. ఓ మహిళ పట్ల కేసీఆర్ సర్కారు విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శించిందని, ఇదో హేయమైన చర్య అని కిషన్ రెడ్డి అన్నారు.


అసలేం జరిగిందంటే..


వరంగల్ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా సోమవారం టీఆర్‌ఎస్‌ నేతలు షర్మిల ప్రచార రథం, వాహనాలపై దాడి చేశారు. ఈ దాడికి నిరసనగా ప్రగతి భవన్‌ ముట్టడికి వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. అలా నవంబరు 29 మధ్యాహ్నం ప్రగతి భవన్ కు వస్తున్న షర్మిలను మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్‌ నేతల దాడిలో ధ్వంసమైన కారును షర్మిల స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు బయలుదేరారు. రాజ్‌భవన్‌ రోడ్డులో వైఎస్‌ షర్మిలను ఆమెను అడ్డుకున్న పోలీసులు ఎస్ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. షర్మిల కారు నుంచి బయటికి రాకపోవడంతో ఏకంగా ఆ కారునే టౌయింగ్ వెహికిల్ సాయంతో లాక్కొని వెళ్లిపోయారు. షర్మిల ఆమె సిబ్బంది కారు లోపల ఉండగానే ఇదంతా జరిగింది. దీంతో పోలీసుల వ్యవహరించిన తీరుపై వైఎస్‌ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధ్వంసం చేసిన వాహనాన్ని కేసీఆర్‌కు చూపించడానికి వెళ్తుంటే అడ్డుకుంటారా అంటూ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.