వివిధ రకాల పథకాల పేరు చెప్పి సీఎం కేసీఅర్ చేసింది మోసమేనని, ఎవరు ప్రశ్నించకూడదని, ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా చేస్తున్నారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు భారీగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. కేసీఆర్ మోసగాడని, ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో దిట్ట అని విమర్శించారు. వైఎస్ షర్మిల పాదయాత్ర వికారాబాద్ జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లాకు చేరింది. సదాశివపేట పట్టణంలో ప్రజలతో మాట్లాడిన ఆమె ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సంక్షేమ పాలన తమ పార్టీతోనే సాధ్యం అవుతుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజలను కేసీఆర్‌తోపాటు కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా మోసం చేశాయని వైఎస్ షర్మిల మండిపడ్డారు.


కేసీఆర్ 8 ఏళ్లుగా అంతా గారడీ మాటలే చెబుతున్నారని, ఉద్యోగాలు లేక వందల మంది బిడ్డలు చనిపోతే రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదని షర్మిల విమర్శించారు. కేసీఅర్ అవినీతిని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏనాడు ప్రశ్నించలేదని అన్నారు. వైఎస్సార్ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని, వైఎస్సార్ సంక్షేమ పాలన కావాలని కోరుకుంటున్న ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరాలని షర్మిల పిలుపునిచ్చారు.


‘‘ప్రజాప్రస్థానం పాదయాత్రలో మీ సమస్యలు చెప్పుకుంటూ.. YSR సంక్షేమ పాలనకు మద్దతు తెలుపుతూ ఆశీర్వదించిన వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం, సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలాల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ తీరుస్తా. మీ కష్టాలు తొలగిస్తా. వైయస్ఆర్ గారు రూ.35వేల కోట్లతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించాలని భావిస్తే.. కేసీఆర్ గారు రీడిజైన్ పేరుతో రూ.55 వేల కోట్లకు పెంచారు. రూ.17వేల కోట్ల పనులు చేపట్టామని చెప్పి, భారీగా కమీషన్లు మింగి, ప్రాజెక్టును అటకెక్కించారు.’’ అని వైఎస్ షర్మిల అన్నారు.


ఏపీ విషయంలోనూ ఇటీవల హాట్ కామెంట్స్
ఇటీవలే సీఎం జగన్ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు తొలగించి, వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ అని పేరు పెట్టాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన అంశంపై కూడా వైఎస్ షర్మిల మరో సందర్భంలో స్పందించారు. తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ..  వైఎస్ కుమార్తె, జగన్ సోదరి మాత్రం ఖండించారు. అ నిర్ణయం కరెక్ట్ కాదని అన్నారు. 


ఒకరి ఖ్యాతి వైఎస్ఆర్‌కు అవసరం లేదు: షర్మిల
ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం ఆ పేరును తొలగిస్తే అవమాన పరిచినట్లేనని షర్మిల స్పష్టం చేశారు. ఓ కుమార్తెగా తనను తండ్రి ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదని, ఈ ప్రపంచంలో తాను తన తండ్రిని ఆరాదించినట్లుగా ఎవరినీ ఆరాధించలేదని అన్నారు. ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లమంది ప్రజలను అవమాన పరిచినట్లేనన్నారు. ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు...రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్సార్ పేరు మారిస్తే అప్పుడు వైఎస్సార్ ను సైతం అవమానించినట్లే కదా అని ప్రశ్నించారు. ఒకరి ఖ్యాతిని తీసుకొని వైఎస్సార్ కు ఆ ఖ్యాతిని ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. YSR చనిపోతే ఆ భాద తట్టుకోలేక 700 వందల మంది చనిపోయారని అన్నారు.


జగన్ నిర్ణయాన్ని షర్మిల వ్యతిరేకించడంపై చర్చ 
పేరు మార్పు బిల్లు ఆమోదం పొందిన తర్వాత రోజు ఓ మీడియాతో మాట్లాడుతూ షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆరే పేరు పెట్టడం కరెక్ట్ కాదని తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీలో తాను ఈ అంశంపై తనను తాను ప్రశ్నించుకున్నానని..  అర్హుల పేరే వైద్య విశ్వవిద్యాలయానికి ఉండాలని, అందుకే పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఇప్పుడు షర్మిల జగన్ నిర్ణయానికి భిన్నంగా ప్రకటన చేయడం వైఎస్ఆర్‌సీపీ నేతల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 


షర్మిల వ్యాఖ్యలపై స్పందించని వైఎస్ఆర్‌సీపీ నేతలు
కొంత కాలంగా జగన్‌కు ఆయన సోదరి షర్మిలకు మధ్య సత్సంబంధాలు లేవన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో షర్మిల జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించడం అది కూడా తన తండ్రి విషయంలో కావడంతో మరింతగా వైరల్ అవుతోంది. షర్మిల ప్రకటనపై వైఎస్ఆర్‌ సీపీ నేతలు ఎలాంటి ప్రకటనలు చేయలేదు.