మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసులో ఏ-4 గా ఉన్న దస్తగిరిని అప్రూవర్‎గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ భాస్కర్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు. దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను సీబీఐ విచారణ చేయగా.. అసలు దస్తగిరిని అప్రూవర్‎గా ఎలా ప్రకటిస్తారని భాస్కర్ రెడ్డి అంటున్నారు. ఈ మేరకు ఆయన్ను అప్రూవర్‎గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 


దస్తగిరి స్టేట్‌మెంట్ ను ఆధారంగా చేసుకొని తమను ఈ కేసులోకి లాగడం కరెక్టు కాదని పిటిషన్‌లో వైఎస్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించారని, అలాంటి ఆయనకు బెయిల్ ఇవ్వడం కూడా సరికాదని పిటిషన్‌లో వివరించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరే అని గుర్తు చేశారు. దస్తగిరి బెయిల్ సమయంలోను సీబీఐ సహకరించిందని, దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదని అన్నారు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్‎ను రద్దు చేయాలని పిటిషన్‌లో భాస్కర్ రెడ్డి కోర్టును కోరారు.


కేసు సీబీఐకి అప్పగించాక అప్రూవర్‌గా మారిన దస్తగిరి


వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సీబీఐకి అప్పగించిన తర్వాత నిందితుల్లో ఒకరైన షేక్ దస్తగిరి అఫ్రూవర్ గా మారారు. వివేకానంద రెడ్డి హత్యకు దారి తీసిన పరిస్థితులు, హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు.. లాంటి విషయాలన్నీ దస్తగిరి కోర్టు ముందు చెప్పినట్లుగా తెలుస్తోంది. సీబీఐ కూడా దస్తగిరి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. అయితే సీబీఐ విచారణ తీరుపై భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన లేఖపై విచారణ జరపకుండా, నిందితుల్లో ఒకరిగా ఉన్న దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా తమను కేసులోకి లాగి విచారించడం సరికాదని అంటున్నారు. దీనిపై ఇప్పటికే అవినాశ్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరగా కోర్టు తిరస్కరించింది. తాజాగా భాస్కర్ రెడ్డి దస్తగిరికి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు.


మార్చి 12న కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌజ్‌కు సీబీఐ విచారణ కోసం వచ్చిన వైఎస్ భాస్కర్ రెడ్డి వెనక్కి వెళ్లిపోయారు. విచారణ చేయాల్సిన సీబీఐ అధికారి లేకపోవడంతో ఆయన తిరిగివెళ్లిపోయారు. ఆ రోజు విచారణకు హాజరు కావాలని భాస్కర్ రెడ్డికి గతంలో నోటీసు అందింది. ఆ ప్రకారం భాస్కర్ రెడ్డి విచారణకు కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌజ్‌కు వచ్చారు. ఆ సందర్భంగా భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విచారణ తేదీని సీబీఐ అధికారులు మళ్లీ తెలియజేస్తామని చెప్పారని తెలిపారు. హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖపై సీబీఐ ఎందుకు విచారణ చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. మీ కుమారుడు అవినాష్‌ రెడ్డితో పాటు మిమ్మల్ని కూడా అదుపులోకి తీసుకుంటామంటూ సీబీఐ తరఫున న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు తెలియజేసిన అంశాన్ని మీడియా ప్రతినిధులు అడగ్గా.. తాము దేనికైనా సిద్ధమని భాస్కర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.