Bandi Sanjay : టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీకి మంత్రి కేటీఆర్ బాధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఆరోపించారు. గ్రూప్-1 పేపర్ లీకేజీ వ్యవహారంలో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయన్నారు. బీఆర్ఎస్ జడ్పీటీసీ, సర్పంచ్, సింగిల్ విండో ఛైర్మన్ పిల్లలు, బంధువులు గ్రూప్ 1 పరీక్షలో క్వాలిఫై అయ్యారన్నారు. ఒకే మండలం నుంచి 50 మందికిపైగా క్వాలిఫై అయ్యారని, ఒక చిన్న గ్రామంలో 6గురు క్వాలిఫై అయ్యారని ఆరోపించారు. ఈ లీకేజీకి కేసీఆర్ కొడుకే బాధ్యుడని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నియమించిన సిట్ విచారణ ఎలా చేయగలదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మంత్రివర్గం నుంచి సీఎం కేసీఆర్ కొడుకును బర్త్ రఫ్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులే అధిక సంఖ్యలో క్వాలిఫై అయ్యారని ఆరోపించారు. 


ఓ చిన్న గ్రామంలో 6గురు క్వాలిఫై 


తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టికొట్టి తన ఇంటికే ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతల పుత్రరత్నాలకు, బంధువులకు ప్రభుత్వ కొలువులు ఇప్పించే కుట్ర చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వ నియామకాల్లో అక్రమాలకు పాల్పడి 30 లక్షల మంది యువతీ, యువకుల జీవితాలను ఆగం చేశారన్నారు.  గ్రూప్-1 పరీక్షకు సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగు చూస్తున్న కొద్దీ TSPSC స్కామ్ అనుకున్న దానికన్నా చాలా పెద్దదని అర్థమవుతోందన్నారు. బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారివద్ద పని చేసే వాళ్లను గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో క్వాలిఫై చేసినట్టు తెలుస్తోందన్నారు. జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మందికిపైగా మెయిన్స్ కు అర్హత సాధించారన్నారు. ఒక చిన్న గ్రామం నుంచే 6 గురు క్వాలిఫై అయ్యారని, వీళ్లంతా ప్రతిభావంతులు అనుకుంటే పొరబాటే అన్నారు. బీఆర్ఎస్ నేతల కొడుకులు, బంధువులు, వాళ్ల వద్ద పనిచేసే వాళ్లు కావడం వీళ్లకున్న ఎక్స్ ట్రా క్వాలిఫికేషన్ అని బండి సంజయ్ అన్నారు.


సిట్ తో నిష్పక్షపాత విచారణ ఎలా సాధ్యం? 
 
"నలుగురు బీఆర్ఎస్ సర్పంచుల కొడుకులు, సింగిల్ విండో ఛైర్మన్ కొడుకుతో పాటు ఒక జడ్పీటీసీ బాడీగార్డ్ కొడుకు క్వాలిఫై అయ్యారు. ఒక సర్పంచ్ కుమారుడికి అర్హతలు లేకున్నా దొడ్డిదారిన క్వాలిఫై చేశారు. ఇదంతా కేసీఆర్ కొడుకు కనుసన్నల్లోనే జరిగింది. ఇందుకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. నిరుద్యోగ యువతకు అన్యాయం చేసి అనర్హులకు ఉద్యోగాలిప్పిస్తున్న కేసీఆర్ కొడుకును తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. సీఎం కొడుకు ప్రమేయం ఉన్న నేపథ్యంలో ఆయన నియమించిన సిట్ తో నిష్పక్షపాత విచారణ ఎలా సాధ్యం? నయీం డైరీ, టాలీవుడ్ డ్రగ్స్ కేసు, మియాపూర్ ల్యాండ్ కేసు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సూసైడ్ కేసు తరహాలోనే పేపర్ లీకేజీ కేసును సైతం సిట్ కు అప్పగించి పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోంది. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు అభ్యంతరం ఎందుకు?" అని బండి సంజయ్ ప్రశ్నించారు.