HYDRA News:హైదరాబాద్‌లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ.. హైడ్రా అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో మాదాపూర్‌లోని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇది అక్రమ కట్టడమని.. చెరువు స్థలంలో నిర్మించారంటూ ఫిర్యాదులు రావడంతో.. తెల్లవారుజామున.. అక్కడకి చేరుకుని... ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేశారు. నామరూపాలు లేకుండా... నిర్మాణాలను నేలమట్టం చేశారు. నోటీసులను గోడకు అంటించి.. వెంటనే కూల్చివేతలు ప్రారంభించారు. నిర్మాహకులకు కూల్చివేతలను అడ్డుకునే అవకాశం కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. ముందస్తుగా నోటీసులు ఇచ్చి ఉంటే.. కోర్టుకు వెళ్లే స్టే తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ.. హైడ్రా అధికారులు ముందస్తు సమాచారం లేకుండా... ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేశారు. అసలు ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌... ఎక్కడ ఉంది...? ఆ కట్టడం ఎందుకు వివాదాస్పదమైంది. 


ఎన్‌ కన్వెన్షన్‌ వివరాలు...
ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌..హైదరాబాద్‌ మాదాపూర్‌ (Madhapur) సమీపంలోని తుమ్మడికుంట ప్రాంతంలో ఉంది. ఇది టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జునకు చెందినది. 2010లో ఎన్‌.కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించారు. ఈ ఎన్‌.కన్వెన్షన్‌ తుమ్మిడి చెరువును ఆనుకునే ఉంటుంది. తుమ్మిడి చెరువు స్థలాన్ని ఆక్రమించి ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. చెరువుకు సంబంధించిన మూడు ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించారు. ఇందులో రెండు ఎకరాలు బఫర్‌ జోన్‌ ఉండగా... మరో 1.12 ఎకరాలు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (FTL) చెరువు శిఖం కిందకు వస్తుంది. చెరువును ఎవరూ ఆక్రమించకుండా... రెండు ఎకరాలను బఫర్‌ జోన్‌గా పెడతారు. కానీ.. నిర్వహాకులు ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించి ఎన్‌ కన్వెన్షన్‌ను నిర్మించినట్టు తెలుస్తోంది. చెరువుగట్టుపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ... ఎన్‌ కన్వెన్షన్‌ ఏకంగా చెరువలోనే నిర్మించారు. ఈ కన్వెన్షన్‌ సెంటర్‌లోని డైనింగ్‌ హాల్‌ గోడ.. చెరువుకు ఆనుకునే ఉంటుంది. అంటే... చెరువుకు అడ్డుకట్టగా.. ఆ గోట కట్టారని స్పష్టంగా తెలుస్తోంది. 






ఎన్‌ కన్వెన్షన్‌ లోపల ఎలా ఉండేదంటే..
మాదాపూర్‌లోని ఎన్‌. కన్వెన్షన్ సెంటర్‌... సెలబ్రిటీల స్టైల్‌లో తమ వివాహాన్ని జరుపుకోవాలనుకునే జంటలకు మంచి వివాహ వేదిక. చెరువు అంచున ఉన్న ఈ సెంటర్‌లో అద్భుతమైన ఇంటీరియర్స్, ఆకట్టుకునే ప్రదేశాలు, రాచరిక వివాహ అనుభవం కోసం అత్యాధునిక సౌకర్యాలు ఉండేవి. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ప్రముఖులు.. ఇందులో వివాహ మహోత్సవాలు జరుపుకునేవారు.


ఎన్‌ కన్వెన్షన్‌ ఎందుకు కూల్చివేశారంటే... 
ఎన్‌ కన్వెన్షన్‌ను మాదాపూర్‌లో 10 ఎకరాల్లో నిర్మించారు. అయితే.. ఆ నిర్మాణం.. తుమ్మడికుంట చెరువుకు ఆనుకుని ఉంటుంది. దాదాపు 29 ఎకరాల్లో తమ్మిడి కుంట చెరువు ఉంటుంది. ఈ చెరువుకు సంబంధించిన మూడు ఎకరాల 30 గుంటల  భూమిని ఎన్‌.కన్వెన్షన్‌ నిర్వాహకులు ఆక్రమించారని కొన్నేళ్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌ కన్వెన్షన్‌ చెరువెకు 25 మీటర్ల ఎఫ్‌టీఎల్‌ (FTL)లో ఉన్నట్లు కూడా గుర్తించారు అధికారులు. నింబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో... ఎన్‌.కన్వెన్షన్‌ను  కూల్చివేశారు.



ఎన్‌ కన్వెన్షన్‌పై ఫిర్యాదులు..
తుమ్మిడికుంట చెరువుపై దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువును కుబ్జా చేసి హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారు. దీనిపై మా ప్రజలు అనేక ఫిర్యాదులు చేశారు. దీంతో..లోకాయుక్త కంప్లైంట్ నెంబర్ 2815/2012/B1గా  స్వీకరించి అధికారులకు చాలా సార్లు హెచ్చరికలు జారీ చేశారు. 2014 జులై 14న చర్యలు తీసుకోవాలనుకున్నారు. కానీ.. ఎందుకో.. యాక్షన్‌ తీసుకోలేకపోయారు. కేసీఆర్‌ హయాంలో... బుల్డోజర్లు ఎన్‌.కన్వెషన్‌ వరకు వెళ్లి... వెనుదిరిగాయి.  అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి... ఎన్‌.కన్వెషన్‌ జోలికి పోలేదు. ప్రభుత్వ భూములు, బఫర్ జోన్స్, FTL పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా ఇప్పుడు ఎంతటి వారైనా ఉపేక్షించడం లేదు. ఈ క్రమంలోనే.. ఇటీవల  కేటీఆర్‌కు చెందినది అని చెప్తున్న జన్వాడ ఫామ్‌హౌస్‌కు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు నాగార్జునకు చెందిన ఎన్‌.కన్వెన్షన్‌ను నేలమట్టం చేసింది.