Kavitha : డియర్ డాడీ అంటూ బీఆర్ఎస్లో లోపాలంటూ సంచలనం సృష్టించిన కవిత... మా నాన్న దేవుడు అంటూ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ మరికొన్ని అనుమానాలకు తెర తీశారు. ఆమె మాటలు, రాసిన లేఖ ఆధారంగా అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీలో కేడర్కు అందుబాటులో ఉండటం లేదు అనేది ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చేస్తూ వచ్చిన ఆరోపణ. కానీ తాను రాసిన లేఖలో ఇదే విషయాన్ని ప్రముకంగా ప్రస్తావించారు కవిత. కొందరికే దర్శన భాగ్యం కలుగుతుందని కూడా అన్నారు. ఆ లెక్కన ఆయన్ని రెగ్యులర్గా కలిసేది కొందరే అనే విషయాన్ని స్పష్టం చేశారు.
అమెరికా నుంచి వచ్చిన కవిత మాట్లాడుతూ... పార్టీలో దెయ్యాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కోవార్టులతో ప్రమాదం ఉందని తెలిపారు. కేసీఆర్ కుమార్తె లేఖే లీక్ అయింది అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని ఘాటుగా బదులిచ్చారు. అంటే కేసీఆర్తో రెగ్యులర్గా ఉన్న వాళ్లే ఆ పని చేసి ఉంటారని కవిత అనుమానం. ఈ అనుమానం చాలా దూరం వెళ్తుంది. ఇందులో చాలా పెద్ద పేర్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్తో నిత్యం ఉండే వ్యక్తులు ఇందులో ఉన్నట్టు కవిత వర్గం ప్రచారం చేస్తోంది.
సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో చీమ చిటుక్కుమన్నా సరే అధినేతకు, తర్వాత నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తులకు తెలుస్తుంది. ఇప్పుడు కవిత లెటర్ లీకు వారెవరికీ తెలియకుండా జరిగిందా అనే అనుమానం చాలా మందిలో కలుగుతుంది. అలా అయి ఉంటే ఈపాటికే అలాంటి వ్యక్తులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే వాళ్లు. ఎందుకంటే ఇక్కడ టార్గెట్ అయింది అధినేత కేసీఆర్ కుమార్తె. కానీ ఇంత వరకు పార్టీలో అలాంటి వాసనలేవీ లేవు. ఈ విషయంలో పార్టీ చాలా సైలెంట్గా ఉంది. కవితను టార్గెట్ చేయాలని అనుకునే వాళ్లు ఇలా చేసి ఉంటారనే సందేహం చాలా మందిలో ఉంది. అలాంటిదేమీ జరగలేదనే క్లారిటీ ఇవ్వాల్సింది ఒక్క పార్టీ ఇద్దరే ఇద్దరు. వాళ్లే కేసీఆర్, కేటీఆర్. మిగతావాళ్లు ఇచ్చినా వాదనకు నిలబడదు.
అందుకే కచ్చితంగా కేసిఆర్కు అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్లే ఇక్కడ లెటర్ను లీక్ చేశారనే బలమైన వాదన కవిత వర్గం చేస్తోంది. అందుకే వారినే కోవర్టులుగా కవిత అభివర్ణిస్తున్నారు. వాళ్లనే దెయ్యాలుగా చెబుతున్నారు. కేసీఆర్ను తప్పుదారి పట్టించి దూరం పెడుతున్నారనేది కవిత భావన. కేసీఆర్కు అంత్యంత సన్నిహింతగా రోజూ సమావేశమయ్యేది ఎవరో తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు. అలాంటి వ్యక్తులు కేటీఆర్కు తెలియకుండా చేసి ఉంటారా అనేది మరో అనుమానం. అందుకే కవితపై కుట్ర జరుగుతోందని కవితక్క టీం గట్టిగా చెబుతున్నారు.
అయితే పార్టీలో కొందరి పెద్దలు మాత్రం దీన్నికి భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. లెటర్ లీకు అయింది మాత్రం కవిత టీం నుంచే అంటున్నారు. కేసీఆర్ వద్దకు యాక్సెస్ లేనందునే ఇలాంటి ఒత్తిడి వ్యూహాన్నిఆమె ఎంచుకున్నారని బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలు తెలిసిన వ్యక్తులు చెబుతున్నమాట. అంటే కేసీఆర్కు సన్నిహితంగా ఉండే వాళ్లను టార్గెట్ చేసేందుకు కవిత ఇది చేసి ఉంటారని వాళ్లంతా అనుమానిస్తున్నారు. అందుకే ఏం జరిగిందో తెలియకపోవడంతో చాలా మంది బీఆర్ఎస్ నేతలు గురువారం నుంచి మీడియాకు అందుబాటులో లేకుండా పోయారు. ఫోన్లు కూడా లేపడం లేదని తెలుస్తోంది. ఈ వివాదం చల్లబడే వరకు వాళ్లంతా ఇలా ఫ్లైట్ మోడ్లో ఉంటారని చెప్పుకుంటున్నారు.
కేసీఆర్ రాజకీయం బాగా తెలిసిన వ్యక్తులు మరో వాదన వినిపిస్తున్నారు. ఇదంతా కేసీఆర్ ప్లాన్లో భాగమేనని మరికొందరు అంటున్నారు. ఎవరినైనా దూరం పెట్టాలంటే కేసీఆర్ అపాయింట్మెంట్లు ఇవ్వబోరని, పార్టీ మీటింగ్స్కి కూడా పిలవరని ఇప్పుడు అదే పొజిషన్లో కవిత ఉండొచ్చని అంటున్నారు. నిన్నటి వరకు కవితక తగిన గౌరవం ఉన్నప్పటికీ రచ్చకెక్కారన్న కోపం కేసీఆర్లో ఉండొచ్చని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నిజమైతే కవితను పార్టీ మొత్తం దూరం పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అధినేత కొందరి వ్యక్తుల చేతిల్లో బంధీ అయిపోయి ఉన్నారనే అనుమాానం కవిత వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ దగ్గరే ఉంటున్న కోవర్టులు ఎవరికి కోసం పని చేస్తున్నారనేది కొత్త అనుమానానికి దారి తీస్తోంది. ఇతర పార్టీలకు పని చేస్తున్నారా లేకా తనను, పార్టీని వేరు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అనేది కూడా తేలాల్సి ఉంది. కేసీఆర్ బంధీ అయింది కుటుంబ సభ్యుల చేతుల్లోనా లేకుంటా బయట వ్యక్తుల చేతుల్లోనా అనేది కూడా స్పష్టం కావాలి.
ఎవరి వాదన ఎలా ఉన్నా, విశ్లేషణలు ఎన్ని వచ్చినా అన్నీ చెప్పేది ఒకటే. గులాబీ తోట బయటకు కనిపించేంత అందంగా లేదనే విషయం ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. అందరూ కలిసి ఉన్నామనే విషయం చెబుతున్నప్పటికీ ఏ రెక్కకు ఆ రెక్క వేరుగానే పని చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింతగా క్లారిటీ రావలంటే మాత్రం కొన్ని ఎదురు చూడక తప్పదు.