Hyderabad: హైదరాబాద్ కు మరో అమెరికా సంస్థ వచ్చింది. అగ్ర దేశానికి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ నగరంలో తమ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దిగ్గజ మీడియా, వినోద రంగ సంస్థగా పేరున్న వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కంపెనీ.. ఐటీ కారిడార్ లోని కాపిటల్యాండ్ టవర్ లో కొత్తగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఒకేసారి 1200 మందికి పైగా ఉద్యోగులు పని చేసేలా సువిశాలమైన ఆఫీస్ స్పేస్ ను తీసుకుంది. 


ఈ ఏడాది మే నెలలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. న్యూయార్క్ పర్యటనలో భాగంగా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో తమ ఆఫీస్ ను ఏర్పాటు చేస్తాని ఆ సమయంలోనే వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ఈ దిగ్గజ సంస్థ ఐటీ కారిడార్ రాయదుర్గంలోని కాపిటల్యాండ్ ఇంటర్నేషనల్ టెక్ పార్క్ లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లో ఐటీ రంగానికే కాకుండా మీడియా, వినోద రంగానికీ  అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉండటంతో కంపెనీ వృద్ధికి ఈ పరిస్థితులు దోహదం చేయనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నగరంలో ఆఫీస్ ను ఏర్పాటు చేయడం ద్వారా వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ భారతీయ మార్కెట్ లోని అపారమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.


రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ


ఇటీవల దుబాయ్ లో పర్యటించిన కేటీఆర్ పలు వ్యాపార, వాణిజ్య సంస్థ ప్రతినిధి బృందాలతో భేటీ అయి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య అనుకూలతలను వారికి కేటీఆర్ వివరించారు. ఇక్కడి పెట్టుబడుల స్నేహపూర్వక వాతావరణాన్ని గురించి తెలియజెప్పారు. టీఎస్ బీపాస్ లాంటి ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, తమ కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు ముందుకు వచ్చాయి. మంగళవారం(సెప్టెంబర్ 5) నాడు రూ.1,040 కోట్ల పెట్టుబడులు రావడం విశేషం. 


అగ్నిమాపక పరికరాల తయారీలో దిగ్గజ సంస్థగా పేరున్న యూఏఈ సంస్థ నాఫ్కో(NAFFCO) తెలంగాణలో రూ. 700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించింది. ఈ మేరకు నాఫ్కో కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్.. మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలని కేటీఆర్ చేసిన ప్రతిపాదనకు సైతం నాఫ్కో సీఈవో అంగీకరించారు. దాదాపు 100కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ నైపుణ్యాన్ని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణ కేంద్రంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.


తెలంగాణ రాష్ట్రంలో రూ. 215 కోట్ల పెట్టుబడితో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రముఖ పోర్టు ఆపరేటర్ డీపీ వరల్డ్ తెలిపింది. డీపీ వరల్డ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ మెహతా, సంస్థ ప్రాజెక్టు డెవలప్‌మెంట్ డైరెక్టర్ సాలుష్ శాస్త్రి, ఇతర ఉన్నతాధికాకరులు మంగళవారం మంత్రి కేటీఆర్ తో దుబాయి లో భేటీ అయ్యారు. పోర్టు ఆపరేటర్ గా ప్రపంచంలోనే అగ్రభాగాన ఉన్న డీపీ వరల్డ్ హైదరాబాద్ లో తమ ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపో ఆపరేషన్ కోసం రూ. 165 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయరంగ ప్రగతికి చేదోడుగా నిలిచే కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌసింగ్ రంగంలో కూడా డీపీ వరల్డ్ పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. మేడ్చల్ ప్రాంతంలో రూ. 50 కోట్లతో 5000 ప్యాలెట్ కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌజ్ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేస్తామన్నారు.