Vikarabad News: వికారాబాద్ శ్రీ అనంత పద్మనాభ కళాశాల విద్యార్థుల నిరసన సెగ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పై పడింది. హైదరాబాద్ నుంచి తాండూరుకు వెళ్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కళాశాల ముందుకు రాగానే విద్యార్థులు కాన్వాయిని అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌ షిప్లను, ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడదల చేయలేదని.. వెంటనే విడుదల చేయించాలని ఎమ్మెల్యేను కోరారు. విద్యార్థుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రికి ఫోన్ చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల నిరసన విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఎమ్మెల్యే.. విద్యాశాఖ మంత్రికి ఫోన్ చేసి సమస్య తీర్చమని కోరడం, ఆమె తీరుస్తామని చెప్పడంతో విద్యార్థులు ఆందోళనను ఆపేశారు.




తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే..


తెలంగాణలో కొద్ది రోజులుగా ఎమ్మె్ల్యేల కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై విచారణ కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు టీమ్ దీనిపై విచారణ జరుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన వికారాబాద్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ మేరకు తనకు అపరిచిత వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన దాదాపు 11 నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్‌ వచ్చాయని ఫిర్యాదులో చెప్పారు. ఆ ఫోన్ కాల్స్ చేసిన వారిలో కొంత మంది తనను హత్య చేస్తామంటూ బెదిరించినట్టుగా రోహిత్‌ రెడ్డి పోలీసులకు చెప్పారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే మరో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.


ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సీక్రెట్ వీడియోలను సీఎం కేసీఆర్ విడుదల చేశాక ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రత కల్పిస్తున్న సంగతి తెలిసిందే. నలుగురు నేతలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు ఎస్కార్ట్ లను కూడా కేటాయించింది. ఆ నలుగురు ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర కూడా సెక్యురిటీని పటిష్ఠం చేసింది. అయితే, తాజాగా ఈ నలుగురు ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫైలట్ రోహిత్ రెడ్డి మాదాపూర్ ఏసీపీకి ఫిర్యాదు చేశాడు.


విచారణ వేగవంతం..


మరోవైపు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో​ సిట్‌ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ముగ్గురు ఎమ్మెల్యేల స్టేట్‌మెంట్స్‌ ను సిట్‌ బృందం రికార్డు చేసింది. ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి నివాసానికి వెళ్లి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. నిందితులు తమను తొలుత ఎలా సంప్రదించారు అనే కోణంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తో కూడిన ప్రత్యేక దర్యాప్తు టీమ్ విచారణ చేపట్టింది. రూ.100 కోట్ల డీల్‌పై ఫాం హౌస్‌లో​ ఏం మాట్లాడారనే అంశంపైన కూడా విచారణ జరుపుతోంది.