Vikarabad Crime News: వికారాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. పట్టణానికి చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు వికారాబాద్ డీటీసీలో హెడ్ కానిస్టేబుల్‌గా ప‌ని చేస్తున్న న‌ర‌సింహ‌ స్వామిగా పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని మృతుడి కుటుంబ సబ్యులకు తెలపగా వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే స్వామి ఆత్మహ‌త్యకు గ‌ల కారాణాలు ఇంకా తెలియరాలేదు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


హైదరాబాద్ లో వైద్యుడి ఆత్మహత్య..


హైదరాబాద్ లో గన్ ఫైర్ కలకలం రేపుతోంది. గన్ తో కాల్చుకోని డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడ్ని జూబ్లీహిల్స్ అపోలోకు తరలించారు. కుటుంబ తగాదాల కారణంగా వైద్యుడు మజార్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12లో తన ఇంట్లో మజార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  తీవ్ర గాయాల పాలైన మజార్ ను అపోలో ఆస్పత్రికి తరలించారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మజార్ చనిపోయాడు. మృతుడు మజార్‌ అలీ ఖాన్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సమీప బంధువు అని సమచారం.  


బంజారాహిల్స్‌లో మజారుద్దీన్ అనే వైద్యుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్ 12లోని తన నివాసంలో గన్‌తో కాల్చుకుని తీవ్ర గాయాలు కాగా వెంటనే కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 64 సంవత్సరాల వయసున్న మజారుద్దీన్ అలీ ఖాన్ మృతి చెందాడు. కుటుంబ తగాదాల కారణంగా ఈ దారుణానికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడు మజారుద్దీన్ అలీ ఖాన్ ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సమీప బంధువు. అసదుద్దీన్ ఓవైసీ రెండో కూతురు అఫియా వివాహం సెప్టెంబర్22, 2020లో మజార్ కుమారుడు అబిల్ అలీ ఖాన్‌తో జరిగింది. ఓవైసీ ఆస్పత్రి ఏర్పాటు చేసినప్పటి నుంచి అందులో ఆర్థోపెడిక్ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు మజారుద్దీన్. ఓవైసీ కుటుంబంతో మజారుద్దీన్ అలీఖాన్ కుటుంబం మధ్య మూడు దశాబ్దాలుగా ఉన్న స్నేహం ఇటీవల బంధుత్వంగా మారింది. ఘటనా స్థలానికి పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ చేరుకుని పరిశీలించారు. ప్రస్తుతం అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


నిన్నటికి నిన్న నిజామాబాద్ లో..


తోటి విద్యార్థి వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్‌ వైద్య విద్యార్థి ప్రీతి ఘటనపై దుమారం రేగుతున్న టైంలోనే మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న హర్ష అనే మెడికో సూసైడ్‌ చేసుకోవడం కలకలం రేగింది. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడకు చెందిన దాసరి హర్ష నిజామాబాద్‌లో వైద్యవిద్యను అభ్యసిస్తున్నాడు. తన హాస్టల్ గదిలోనే ఈ ఉదయం సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనగా స్థలానికి చేరుకొని హర్ష మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగిన వైద్య విద్యను అభ్యసిస్తున్న హర్ష మరణం ఆ ఫ్యామిలీలోనే కాకుండా గ్రామంలోనే విషదాన్ని నింపింది. శుక్రవారం ఓ పరీక్ష రాయాల్సిన హర్ష ఆ పరీక్షలు వెళ్లకుండా హాస్టల్‌లోనే ఉండిపోయారు. ఎందుకు పరీక్షలు రాలేదని అనుమానం వచ్చిన తోటి స్నేహితులు హాస్టల్‌కు వెళ్లి చూస్తే విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.