Venkaiah Naidu: నేడు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. కేవలం టీఆర్ఎస్ యే కాకుండా మిగతా పార్టీలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రాహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. పూల మాల వేసి మరీ దండం పెట్టుకున్నారు. హైదరాబాద్ సంస్థాణం స్వాతంత్రంగా ఉండాలని ఉక్కు మనిషి సర్దార్ పటేల్ నిర్ణయం తీసుకొని ముందుకెళ్లారని గుర్తు చేశారు. ఈరోజు చారిత్రాత్మకమైన రోజు అని వ్యాఖ్యానించారు. తెలంగాణా ప్రాంతంలో రజాకారుల చర్యలకు సర్దార్ పటేల్ అడ్డుకట్ట వేశారని చెప్పుకొచ్చారు. భారత దేశంలో సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ సంస్థానం విలీనం అయిందన్నారు. దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ కి స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. 






అందరూ సర్దార్ పటేల్ ను ఆదర్శంగా తీస్కోవాలి..


నిజాం హైదరాబాద్ ను పాకిస్తాన్ లో కలపాలని చూశారని.. కానీ సర్దార్ పటేల్ దానికి ఏమాత్రం ఒప్పుకోకుండా నిరసనకు దిగారని వెంకయ్య నాయుడు వివరించారు. సర్ధార్ అఖండ దేశ భక్తుడని, దేశ సమైఖ్యతకు బలమైన నిర్ణయాలు తీసుకొన్నారని ప్రశంసించారు. విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదని సూచించారు. కుల మతాలకు వ్యతిరేకంగా దేశ సమైఖ్యతను ముందుకు తీసుకెళ్లాలన్నారు. సర్ధార్ పటేల్ ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వివరించారు.


ఏడాది పాటు విమోచన దినోత్సవ వేడుకల నిర్వహణ..


తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ జవాన్లు కవాతు నిర్వహిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో భాగంగానే అమరవీరుల స్ఱూపం వద్ద కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పిస్తారని తెలిపారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17వ తేదీ వరకు విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విముక్తి దివాస్ పేరుతో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో వేడుకలు జరుగుతాయని వివరించారు. విమోచన దినోత్సవ వేడుకల కోసం 25 సంవత్సరాలు బీజేపీ పోరాడిందని తెలిపారు. కానీ అప్పటి ప్రభుత్వాలు కనీసం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా తెలంగాణ విమోచన వేడుకలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. అది తమ అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.


గ్రామగ్రామాన జాతీయ జెండా ఎగురవేయాలి..!


తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వీరుల జ్ఞాపకార్థం అన్ని గ్రామాల్లో జాతీయ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఉన్న బురుజుల పైన జెండా ఎగుర వేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని గ్రామాల సర్పంచ్ లకు లేఖలు రాశామని తెలిపారు. రేపు సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలు వస్తారని సమాచారం. సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపించామని తెలిపారు. కానీ సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి సమాచారం లేదని కిషన్ రెడ్డి తెలిపారు. అంతే కాకుండా తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం పంపించామని స్పష్టం చేశారు.