తెలంగాణ అధికార పార్టీ నేతలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు పెంచుతున్న వేళ ఇరు పార్టీల నాయకుల మధ్య కౌంటర్‌లు ప్రతి కౌంటర్లు కొనసాగుతున్నాయి. సోమవారం (మే 2) ఉదయం మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీ లక్ష్యంగా వరుస ట్వీట్లు చేసిన కాసేపటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. టీఆర్ఎస్‌పై ట్విటర్ వేదికగా కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ పాలనలో వారు ముందుగా హామీ ఇచ్చిన మేరకు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి లేనే లేదని విమర్శించారు. ఉచిత ఎరువుల మాట ఎత్తిన కేసీఆర్ కూడా ఆ దిశగా ముందడుగు వేయలేదని, రుణ మాఫీ గురించి మర్చిపోయారని అన్నారు. దళిత ముఖ్యమంత్రి ఊసు ఎత్తి దాని గురించే మర్చిపోయారని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, పంట నష్ట పరిహారం, దళిత బంధు, బీసీ బంధు లాంటివి అన్నీ మర్చిపోయారని విమర్శించారు.


పేదలకు హామీ ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్ల సంగతి కూడా పక్కన పెట్టారని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులకు కొదవ లేదని, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కూడా దాని గురించి మర్చిపోయారని అన్నారు. కొత్త పెన్షన్ కార్డుల జారీ చేయడం లేదని, సామాజిక న్యాయం, చివరికి సచివాలయం కూడా లేదని అన్నారు. సీఎం ప్రజలను కలిసేది లేదని, ఉద్యమ కారులకు ఈ రాష్ట్రంలో గౌరవం లేదని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం విషయం  కూడా మర్చిపోయారని అన్నారు. ఇలా చెప్పుకుంటూపోతే సీఎం కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదని ట్విటర్ వేదికగా కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు.


‘‘టీఆర్ఎస్ పాలనలో "ఇంటికో ఉద్యోగం లేదు" "నిరుద్యోగ భృతి లేదు" "ఉచిత ఎరువులు లేదు" "ఋణమాఫీ లేదు" "దళిత ముఖ్యమంత్రి లేదు" "దళితులకు మూడెకరాల భూమి లేదు" "పంటనష్ట పరిహారం లేదు" "దళితబందు లేదు" "బిసిబందు అసలే లేదు" "ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసు లేదు" "డబుల్ బెడ్ రూమ్ జాడ లేదు" "అప్పులకు కొదవ లేదు" "కొత్త రేషన్ కార్డుల ఊసు లేదు" "కొత్త పెన్షన్ కార్డుల జాడ లేదు" "సామాజిక న్యాయం లేదు" "సచివాలయం లేదు" "సీఎం ప్రజలను కలిసేది లేదు" "ఉద్యమ కారులకు గౌరవం లేదు" "విమోచన దినోత్సవం జరిపేది లేదు" ఇలా చెప్పుకుంటూ పోతే "కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదు" అంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.