Swapanloka Fire Incident: సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగిన స్వప్నలోక్ కాంప్లెక్స్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. స్థానికంగా ఉన్న అధికారులను అడిగి అన్ని వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం అగ్ని ప్రమాదాల నివారణకు కఠినంగా వ్యవహరించాలని కిషన్ రెడ్డి కోరారు. కమిటీలు ఏర్పాటు చేయడం మినహా ప్రమాదాల నివారణకు కృషి చేయడం లేదని  విమర్శించారు. అక్రమ కట్టడాలకు జీహెచ్ఎంసీ ఏమాత్రం అడ్డు చెప్పకుండా, రెగ్యులరేషన్ పేరుతో ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పని చేస్తుందని ఆరోపించారు. ప్రమాదల నివారణకి జీహెచ్ఎంసీ ఏమాత్రం పాటుపడడం లేదని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఉంటాయని మృతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. కేంద్రం నుండి రెండు లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. 






"అటు ఫైర్ డిపార్ట్ మెంట్ కానీ ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ కానీ జీహెచ్ఎంసీ డిపార్ట్ మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్ మెంట్ కానీ వీళ్లకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి వాళ్లకు రెగ్యులర్ గా ఇదే బాధ్యత ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నం ఆ కమిటీల ద్వారా చేయాలి. అందులో ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడకుండా నిజాయితీతో వ్యవహరించేటటువంటి అధికారులతో వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను. నేను టూర్ లో ఉన్నాను. వెంటనే నేను గౌరవ ప్రధాన మంత్రి గారితోటి మాట్లాడి ఇక్కడ నా నియోజకవర్గంలో మరి మా జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్స్ నాకిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు నేను ప్రధాన మంత్రి గారితోటి మాట్లాడి ఆరు మంది చనిపోయారు. మనం కొంత ఆర్థిక సాయం ప్రకటించాలని చెప్పినప్పుడు ప్రధాన మంత్రి గారు ఒకరొకరికి రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.


అదే కాకుండా స్టేట్ డిజాస్టర్ తరఫున కూడా మేం 50 శాతం ఇస్తాం. స్టేట్ గవర్నమెంట్ 50 శాతం ఇస్తుంది. స్టేట్ డిజాస్టర్ తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకోవచ్చని కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోం సెక్రటరీ వారు కూడా చెప్పారు. కాబట్టి వారు డిజాస్టర్ మేనేజ్ మెంట్ తరఫున కూడా ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం పెడ్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50 శాతం పెడ్తుంది. ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ప్రమాదాలు కానీ వచ్చినప్పుడు ఎవరి అనుమతి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం 50 శాతం ఇచ్చినప్పటికి కూడా స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఈ రకమైనటువంటి మరి సంఘటనలు జరిగినపుడు ఆ డబ్బులు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి." - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి