GHMC NEWS: నకిలీ వేలిముద్రలతో పారిశుద్ధ్య కార్మికుల వేతనం అపహరిస్తున్న ఇద్దరు జీహెచ్ఎంసీ(GHMC) పొరుగు సేవల ఫీల్డ్ అసిస్టెంట్లను  హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి క్లోనింగ్(Clonig) యంత్రాలు, నకిలీ వేలిముద్రలు స్వాధీనం చేసుకున్నారు. ఏడాదికి రూ.43 లక్షలు చొప్పున  రెండేళ్లుగా రూ.86 లక్షలు  వేతనాల సొమ్ము వీరిరువురూ కాజేసినట్లు తేలింది..


పారిశుద్ధ్య కార్మికుల సొమ్ము పక్కదారి
రోడ్లు ఊడ్చి, చెత్తా చెదారం ఏరివేసే పారిశుద్ధ్య కార్మికుల కూలి డబ్బులను కూడా కొందరు కాజేస్తున్నారు. విధులకు హాజరుకాని కార్మికులు  వచ్చినట్లు చూపి వారి వేతనాన్ని అప్పనంగా జేబులో వేసుకుంటున్న జీహెచ్ఎంసీ(GHMC) పొరుగు సేవల ఫీల్డ్ అసిస్టెంట్ల ఆటను హైదరాబాద్(Hyderabad) టాస్క్ ఫోర్స్(Tack Force) పోలీసులు కట్టించారు. వీరి నుంచి నకిలీ వేలిముద్రల క్లోనింగ్  యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హాలీవుడు సినిమాస్థాయిలోని వీరి పనితనం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. పారిశుద్ధ్య కార్మికుల వేలిముద్రల క్లోనింగ్ కోసం వీరు పెద్ద కసరత్తే  చేశారు. శివయ్య ఉమేశ్, శివారం అనే పొరుగుసేవల ఉద్యోగులు పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదు తీసుకుంటారు. తెల్లవారుజామునే రోడ్లపైకి వచ్చిన పారిశుద్ధ్య కార్మికుల నుంచి వేలిముద్రల ద్వారా హాజరు తీసుకోవడం వీరి పని. అయితే ఎవరైనా కార్మికులు ఆరోజు పనికి రాకుంటే లెక్కప్రకారం ఆప్సెంట్ వేయాలి. కానీ వీరి వద్ద పనిచేసే కార్మికుల వేలిముద్రలన్నీ ముందుగానే క్లోనింగ్  చేసుకున్న వీరు...వాటి సాయంతో వారు ఆరోజు పనిలోకి వచ్చినట్లు హాజరు వేస్తున్నారు. దీని ప్రకారం జీహెచ్ఎంసీ(GHMC) లెక్కల్లో వారు ఆరోజు విధులకు హాజరైనట్లే లెక్క. ఈ విధంగా ఆరోజు వారికి వచ్చిన కూలి సొమ్మును వీరు కాజేస్తున్నారు. ఏడాదిగా సాగుతున్న ఈ తంతును పోలీసులు బట్ట బయలు చేశారు. ఏడాది కాలంగా సుమారు రూ.43 లక్షలు వీరు కాజేసినట్లు తేలింది.
వేలిముద్రల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
పారిశుద్ధ్య కార్మికుల వేలిముద్రలన్నీ ముందుగా కొవ్వొత్తి మైనంపై తీసుకున్న వీరు.. ఆతర్వాత వాటిని ఫెవికాల్, వ్యాక్స్ వంటివాటి పైకి తీసుకుని  వాటి ద్వారా హాజరువేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వీరు యూట్యూబ్ (Youtube)లో చూసి తయారు చేసుకోవడం విశేషం. దాదాపు 35 మంది పారిశుద్ధ్య కార్మికుల నుంచి వీరు వేలిముద్రలు సేకరించడం విశేషం. వీరిలో శివయ్య ఉమేష్ వద్ద 21 మంది పనిచేస్తుండగా...శివరాం వద్ద 14 మంది పనిచేస్తున్నారు. విధులకు రాని వారికి సైతం  హాజరు వేసి ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న వీరిరువురూ  వచ్చిన దాన్ని చెరిసగం పంచుకుంటున్నారు. కొందరు పనికిరాకున్నా వారి హాజరుపడటంతో అనుమానం వచ్చిన అధికారులు వీరిపై నిఘా ఉంచారు. రెండేళ్లుగా  ప్రతిరోజూ 20 మందికి పైగా నకిలీ హాజరు వేస్తున్నారు. దీనివల్ల జీహెచ్ఎంసీపై నెలకు రూ.3.60 లక్షలు నష్టం వాటిల్లుతోంది. ఈ చొప్పు ఏడాదికి 43.20లక్షలు కాజేశారు. రెండేళ్లుగా  ఈ తంతు నడిపిస్తుండగా...మొత్తం రూ.86.40 లక్షలు పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పేరిట దోచుకున్నట్లు  హైదరాబాద్ టాస్క్ పోర్సు పోలీసుల విచారణలో తేలింది. హైదారాబాద్ మొత్తంలో 24వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తుండగా....వారి నుంచి 900 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు  హాజరు తీసుకుంటున్నారు. ఇక ఇలాంటి వారు నగరంలో ఎంత మంది ఉన్నారో తెలియదు. నిందితుల నుంచి 35 సింథటిక్ వేలిముద్రలతోపాటు రెండు బయోమెట్రిక్(Biometric) హాజరు యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు.