TSRTC Cyber Liner: ఐటీ ఉద్యోగుల కోసం తెలంగాణ ఆర్టీసీ కొత్తగా కొత్తగా సైబర్ లైనర్ బస్సు సర్వీసును ప్రారంభించింది. ఉద్యోగుల కోసం మాత్రమే ఈ బస్సులు రోడ్లపై తిరగబోతున్నాయి. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి మూడు ఐటీ కారిడార్లలో ఈ బస్సులు నడపనున్నారు. వీటికి ఆదరణ మెరుగ్గా ఉంటే మరికొన్ని బస్సులు ప్రారంభించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి ఈ కొత్త సర్వీసులు ప్రారంభం కానున్నాయి. హైటెక్స్ మెట్రో స్టేషన్ సమీపంలో వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గతంలో అంటే దాదాపు ఏడేళ్ల క్రితం ఆర్టీసీ వజ్ర పేరుతో మినీ ఏసీ బస్సులను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. వాటి నిర్వహణ, రూట్ల ఎంపిక పూర్తిగా నష్టాలు తెచ్చేలా, ప్రణాళిక లేకుండా ఉండడంతో అప్పట్లోనే ఆ ప్రయోగం వికటించింది. కోట్ల రూపాయల్లో నష్టాలు కూడా వచ్చాయి. దీంతో వాటిని దూర ప్రాంతాలకు తిప్పడం ప్రారంభించారు. 


ఆ బస్సులకే కొత్త రూపు ఇచ్చి సైబర్ లైనర్ లుగా..


కానీ బస్సుల్లో సాంకేతిక సమస్యలు తీవ్రంగా ఉండడంతో ఆ ప్రయోగనం కూడా విఫలం అయిపోయింది. చూస్తుండగానే అవి డొక్కుగా మారి పూర్తిగా పాడైపోయాయి. మొత్తం వంద బస్సులకు గాను 32 బస్సులు కొంత మెరుగ్గా ఉండడంతో వాటిని పక్కన పెట్టి మిగతావాటిని అమ్మేశారు. మిగిలిన ఆ 32 బస్సులను సైబర్ లైనర్ లుగా మార్చాలని నిర్ణయించి తొలుత పది బస్సులకు వర్క్ షాపు నిర్వహించి వాటిని బాగు చేశారు. కొత్త రూపు ఇచ్చి మెరిసిపోయేలా చేసి వాహ్వా అనిపిస్తున్నారు. అయితే గతంలో సిటీలో ఓల్వో సీ బస్సులను మెట్రో లగ్జరీలుగా తిప్పడంతో వాటికీ ఐటీ ఉద్యోగుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. కానీ మెట్రో రైళ్ల ప్రారంభంతో అవి దివాలా తీశాయి. దీంతో వాటిని తప్పించి దూర ప్రాంత సర్వీసులుగా మార్చారు. అయితే మెట్రో రైలు దిగిన ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లడం కష్టంగా మారింది. 


ఉదయం, సాయంత్ర వేళల్లో అందుబాటులో..!


ఈ సమస్యను గుర్తించిన ఆర్టీసీ సైబర్ లైనర్ ప్రత్యేక బస్సు సర్వీసును ప్రారంభించింది. మెట్రో రైలు దిగిన ఐటీ ఉద్యోగులకు ఇవి రెడీగా ఉంటాయి. ఇవి రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఐటీ హబ్ నగర్, వేవ్ రాక్, విప్రో రూట్లలో తిరుగుతాయి. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. తిరిగి సాయంత్రం ఐటీ ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు వీలుగా సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు.. ఆ మూడు ప్రాంతాల నుంచి తిరిగి రాయదుర్గం మెట్రో స్టేషన్ వరకు తిరుగుతాయి. గర్ ప్రాంతానికి రూ.40, మిగతా రెండు ప్రాంతాలకు రూ.30 టికెట్ ధర నిర్వహించారు. సాధారణ ప్రయాణికులకు కూడా ఇవే ధరలు వర్తిస్తాయి. ఈ బస్సులకు మధ్యలో హాల్టులుంటవు. అందుకే వీటిల్లో కండక్టర్ ఉండడు. ఇవి విజయవంతం అయితే మరిన్ని బస్సులను ప్రారంభించాలని ఆర్టీసీ భావిస్తోంది.